సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 7 : వర్షాకాలంలో ఒక పక్క వాన ప డు టతుంటే, మరో పక్క వేడివేడి బొగ్గులపై కాల్చిన మక్కకంకి తిం టుంటే ఆ మజానే వేరు. ఈ కాలంలో మొక్కజొన్న పొత్తులు బాగా దొరుకుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా, పాప్కార్న్లాగా తీసుకున్న వాటి రుచి అమోఘం. మొక్కజొన్న పొత్తులతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. వర్షాకాలంలో తింటే ఈ కాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి మొక్కజొన్న కంకుల సీజనల్ బిజినెస్తో సిద్దిపేట రూరల్ మండలంలోని పలు గ్రామాల కొందరు కూలీలు ఉపాధి పొందుతున్నారు. పుల్లూరు నుంచి ముస్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వెంట మొక్కజొన్న కంకుల విక్రయం జోరుగా సాగుతోంది. ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు, సమీప ప్రాంత గ్రామస్తులు బైక్లు, ఆటోలు నిలిపి మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గత రెండురోజులక్రితం మండలంలో చల్లటి గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఇలాంటి సమయాల్లో వేడిగా ఉన్న కంకులు తిని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మొక్కజొన్నలో ప్రయోజనాలు
మొక్కజొన్నలో విటమిన్ ఈ, బీ1,బీ6, మియాసిన్,పోలిక్యాసిడ్లాంటి, రెబోప్లోవిన్, పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో కాపర్, ఐరన్, మినరల్స్ లభిస్తాయి. పసుపురంగులో ఉన్న మొక్కజొన్న గింజల్లో మెగ్నిషియం, పాస్పరస్ ఉండడంతో ఎముకలు గట్టిపడేందుకు, కిడ్నీలు ఆరోగ్యం ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా ఉండేలా ఉపయోగపడుతుందనే విషయం చాలామందికి తెలియదు. రోజూ మొక్కజొన్నతినే వారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్న తక్షణం శక్తినిచ్చే పదార్థం కావడంతో అందరూ ఇష్టపడతారు. మొక్కజొన్న జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.
గజ్వేల్ టు పుల్లూరు దిగుమతి
మొక్కజొన్న పంట సిద్దిపేట మండలంలో ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. సీజనల్ వ్యాపారంపై ఆధారపడ్డ మండలంలోని కొన్ని గ్రామాలవాసులు మొక్కజొన్నను గజ్వేల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గజ్వేల్ సమీప గ్రామాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగవుతోంది. అక్కడి నుంచి గన్నీ సంచుల్లో సిద్దిపేట మార్కెట్కు తీసుకువస్తున్న వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాలో 70 నుంచి 80 కంకులు వస్తాయని కూలీలు చెబుతున్నారు. అయితే వీరంతా సిద్దిపేట మార్కెట్లో ఒక్కో కంకికి రూ.10 నుంచి రూ.13 వరకు కొనుగోలు చేసి ఆటోల్లో తరలిస్తున్నారు. కాల్చిన అనంతరం వీటిని ఒక్కో కంకిని రూ.20 రూపాయలకు అమ్ముకుంటున్నారు.
గిరాకీ ఉంటుంది
మేం సీజనల్ వ్యాపారం చేస్తాం. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి దసరా వరకు రోడ్డు వెంట కంకులు ఉడుకబెట్టి, కాల్చి అమ్ముతాం. మాకు సిద్దిపేట మార్కెట్లో ఒక్కో కంకికి
రూ.13 వరకు పడుతుంది. మేం కాల్చిన కంకిని రూ.20కి అమ్ముతాం. నేను పొద్దుగాళ్ల నుంచి పొద్దుపోయే వరకు మూడు సంచుల వరకు అమ్ముతా. రోజుకు రూ.1200 వరకు మిగులుతాయి. – కుమ్మల లలిత, కంకుల విక్రేత