న్యూఢిల్లీ: ప్రతిదానికీ ఇండియాను నిందించడం, ఎక్కడెక్కడో ఉన్నవాటిని మెచ్చుకోవడం మానాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో ఉద్బోధించారు. ఊరికే ఇండియాను తిట్టుకుంటూ కూర్చోవద్దని.. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని భారత్ విమర్శకులకు హితవు పలికారు. జపాన్లోని ఒసాకా నగరం తాజాగా పెచ్చరిల్లుతున్న కోవిడ్ కల్లోలంతో సతమతమవుతూ ఉన్నది. ఆ నగరం ముంబై మోడల్ను అమలు చేయాలని ఆయన సూచించారు. మనమంతా ఉమ్మడిగా కృషి చేస్తేనే వైరస్పై విజయం సాధించగలమని అన్నారు. రేవుపట్టణం, వ్యాపార కేంద్రమైన ఒసాకాకు, ముంబైకి దగ్గరి పోలికలు ఉన్నాయని మహీంద్ర పేర్కొన్నారు. జపనీస్ నమూనా గురించి ఇన్నాళ్లూ మనం గొప్పగా చెప్పుకున్నాం.. కానీ ఇప్పుడు ఎవరూ సురక్షితంగా లేరు. అంతా కలిసే ఏదైనా చేయగలం.. ఒసాకా కరోనాను ఎదుర్కోవడంలో ముంబై మోడల్ను అనుసరించాలని సూచించారు. పలువురు నెటిజనులు మహీంద్రా సూచనను ప్రశంసించారు. ఓ స్థాయి కలిగిన వ్యక్తి భారత్ను దుయ్యబట్టవద్దని ధైర్యం చేసి సలహా ఇవ్వడం మంచి విషయమని ఓ యూజర్ కామెంట్ చేశారు.