రెండు దశాబ్దాలకు పైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా 38 ఏండ్ల మిథాలీ చరిత్రకెక్కింది. మార్చి 12న దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేయడం ద్వారా మిథాలీ ఈ ఘనత సాధించింది.
మహిళల క్రికెట్లో మిథాలీ 10,001 పరుగులతో రెండో ప్లేస్లో ఉండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్ట్స్ 10,273 పరుగులతో అగ్రస్థానంలో ఉంది. అరుదైన ఘనత సాధించిన మిథాలీని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ అభినందించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. మిథాలీకు శుభాకాంక్షలుతెలియజేశారు. అరుదైన ఘనత సాధించిన మీరు మమ్మల్నిందరిని గర్వపడేలా చేశారు. జీవితంలో ఇలాంటివి ఎన్నో సాధించాలని కోరుకుంటున్నా అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు సూపర్ స్టార్.