శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న సహకారంతో హైదరాబాద్ నగరం భద్రతపరంగా అత్యంత సురక్షితమైన సిటీగా ముద్ర వేసుకుంది. నగరంలో అన్ని వేళలా పోలీసులు అందుబాటులో ఉండడంతో ప్రజలు వారికి ఉండే చట్టపరమైన స్వేచ్ఛ
వాతావరణంలో ఏ సమయంలోనైనా తిరిగే పరిస్థితి లభిస్తుంది. ఈ సురక్షితమైన భావాన్ని మరింతగా పటిష్టం చేసేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ‘క్రైం హామ్ ఇండెక్స్’ థియరీని అవలంభిస్తున్నారు. ఇది నేరాలు నిర్మూలన, నేరగాళ్ల కట్టడికి దోహదపడుతుండడంతో
ముందుగా ఈ ఫార్ములాను కొనసాగిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వం శాంతి భద్రతల కోసం తీసుకుంటున్న చర్యలతోనే నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. దేశంలోనే సురక్షితమైన నగరంగా పేరొందింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహంతో నేరం చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. ప్రజలు భయాందోళన, కలవరం, అపోహ, అనుమానాలు వంటివి లేకుండా స్వేచ్ఛగా జీవించాలి. దీని కోసం వారి చుట్టు చోటు చేసుకునే నేరాలు, నేరగాళ్ల పట్ల కఠినంగా ఉంటున్నాం. ప్రజలకు బయటికి వెళితే మేము సురక్షితమనే భావనను కలిగించాం. దీంతో ప్రజలు కూడా నేరాలకు పాల్పడే వారికి శిక్షలు పడేలా పోలీసులకు సహకరిస్తున్నారు. న్యాయమూర్తులు కూడా కరుడుగట్టిన నేరగాళ్ల కేసుల విచారణను ఫాస్ట్ ట్రాక్లో వేగంగా విచారణను పూర్తి చేస్తుండడంతో నిందితులు తప్పించుకోలేకపోతున్నారు. మొత్తానికి ‘క్రైం హామ్ ఇండెక్స్’ మంచి ఫలితాలను ఇస్తుంది. మహేశ్భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
ఉత్తర్ప్రదేశ్కు చెందిన బుటుల్ గ్యాంగ్ చాలా కిరాతకమైనది. ఈ ముఠా తుపాకీ ఎక్కు పెట్టి దోపీడీలు చేస్తారు. రెండేండ్ల కిందట కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బంగారం దుకాణంలోకి దూరి వారిపై తుపాకీ ఎక్కుపెట్టి దోపీడీకి యత్నించారు. దుకాణాదారులు తిరగబడడంతో కాల్పులు జరిపారు. ఈ ముఠాను పట్టుకుని జైలులో పెట్టిన పోలీసులు పట్టుబడ్డ ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ను పెట్టారు. ఈ సమయంలోనే వారి కేసులను కోర్టులో విచారణను పూర్తి చేసి దుండగులకు 8 ఏండ్లు జైలు శిక్ష పడేలా చేశారు. ప్రస్తుతం ఈ ముఠా జైలులోనే ఉంది. ఇప్పటి వరకు ఈ ముఠా మరో నేరం చేయకుండా అడ్డుకట్ట పడింది.
రెండేండ్ల కిందట చెడ్డీ గ్యాంగ్ పేరు చెప్పగానే శివారు ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. సీసీ కెమెరాల్లో వారి దృశ్యాలను చూసి ప్రజల్లో కలవరం మొదలైంది. పోలీసులు ఈ గ్యాంగ్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ ముఠాకు చెందిన దాదాపు ఐదుగురిపై పీడీ యాక్ట్ పెట్టారు. ఈ సమయంలోనే వారి కేసుల విచారణను వేగవంతం చేసి ఈ మఠా సభ్యులకు మూడేండ్లు జైలు శిక్ష పడేలా చేశారు. ప్రస్తుతం వారంతా జైలులో ఉన్నారు. ఇక చెడ్డీ గ్యాంగ్ పేరు వినపడడం బంద్ అయ్యింది.
రెండేండ్ల కిందట ఓ బీ-ఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడి బంగారం ఎత్తుకెళ్లిన దుండగుడి సంఘటన ఓ పెద్ద సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటనలోని ప్రధాన నిందితుడు ఐతం రవికుమార్ను అరెస్టు చేసిన పోలీసులు పీడీ యాక్ట్ను విధించారు. ఆ తర్వాత అతని కేసులలోని అభియోగాలన్నింటికీ పూర్తి ఆధారాలు నిరూపించి జీవిత ఖైదీ శిక్ష పడేలా చేశారు. ఈ తీర్పు అమాయకుల వైపు చెడు దృష్టితో చూసే వారికి ఓ భయాన్ని కల్పించింది.
బాలాపూర్లో ఓ పేరొందిన రౌడీషీటర్ ముబారక్ బిన్ రెండేండ్ల కింద రోడ్డుపై హల్చల్ చేసి ఓ వ్యక్తిని కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళన సృష్టించింది. ప్రజలకు ముబారక్ అంటే భయం ఏర్పడింది. అతనిని అరెస్టు చేసిన పోలీసులు అతని నేర చరిత్రను పరిశీలించి పీడీ యాక్ట్ విధించారు. ఏడాది పీడీ యాక్ట్ గడవులోనే ముబారక్ కేసులను విచారించి అతనికి ఐదేండ్లు జైలు శిక్ష పడేలా దర్యాప్తు విచారణను చేపట్టారు. దీంతో ముబారక్ 6 ఏండ్లు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ చర్యలతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలకు ముబారక్ అంటే భయం పోయింది. పోలీసులపై నమ్మకం వచ్చింది.
నేరం వల్ల ప్రజల్లో కలిగే భయం… నేరస్తులను చూస్తే కలిగే ఆందోళన… సాక్ష్యం చెప్పడానికి బాధితుల్లో కలిగే కలవరాన్ని తొలగించి ప్రజలకు పోలీసులపై, ప్రభుత్వ పని తీరుపై నమ్మకం కలిగించడం. దీని కోసం ఈ థియరీ ఫార్ములాను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తన అస్త్రంగా మార్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రజలను కలవరపెట్టే నేరాలలో నిందితుల అరెస్టును పక్కాగా చేశాడు. ఆ తర్వాత వారి నేర చరిత్ర ఎంత ప్రమాదకరమో ప్రభుత్వానికి వివరించి వారిపై పీడీ యాక్ట్ను విధించారు. అనంతరం వారిపై నమోదైన కేసులను త్వరగా విచారించి నిందితులకు కచ్చితంగా శిక్షపడేలా విచారణ, ఆధారాల సేకరణను సమర్థవంతంగా చేశారు. దీని కోసం మహేశ్భగవత్ న్యాయమూర్తులకు లేఖలు రాసి ఆ కేసుల విచారణ త్వరగా జరిగేలా చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ నేరాలు తిరిగి జరగవు…ఒకవేళ జరిగినా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని భరోసా నింపారు.
క్రైం హామ్ ఇండెక్స్ థియరీతో ముందుగా రాచకొండ పోలీసులు సాక్ష్యులుగా ఉండే బాధితులకు పూర్తి భద్రతపరమైన వాతావరణం కల్పిస్తున్నారు. వారి కలవరాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపుతున్నారు. ఈ ప్రయత్నంతో బాధితులు ఏలాంటి జంకు, వణకు లేకుండా అఘాయిత్యాలకు, దోపీడీలకు, దొంగతనాలకు, దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తు పట్టి ధైర్యంగా నిందితుడు చేసిన ఘోరాన్ని వివరిస్తున్నారు. దీంతో కేసు వీగిపోకుండా నిందితులకు శిక్షలు పక్కాగా పడుతున్నాయి.
రాచకొండ పోలీసు కమిషనరేట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 481 మంది మీద పీడీ యాక్ట్లను విధించారు. పీడీ యాక్ట్లు పడిన వారిలో రౌడీషీటర్లు, దొంగలు, మనుషుల అక్రమ రవాణకు పాల్పడిన వారు, నకిలీ విత్తనాలను విక్రయించిన వారు, ప్రజలకు హాని కలిగించే వారందరిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో 161 మందిపై పీడీ యాక్ట్లను పెట్టారు. ఇలా పీడీ యాక్ట్లు విధించడంతో ఆ నేరగాళ్ల క్రైం పూర్తిగా తగ్గింది. 481 పీడీ యాక్ట్లలో 45 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్ సమయంలోనే వారి కేసులపై విచారణను పూర్తి చేసి అభియోగాలను నిరూపించి వారు జైళ్లలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. యాదాద్రి-భువనగిరి డీసీపీ జోన్ పరిధిలో జరిగిన విద్యార్థినిలపై లైంగిక దాడి, హత్యలకు పాల్పడ్డ శ్రీనివాస్రెడ్డిపై పీడీ యాక్ట్తో పాటు అతనికి రెండు కేసులలో ఉరి శిక్ష పడేలా పోలీసు విచారణ కొనసాగింది. ఇంకా చాలా కేసులలో 20 ఏండ్లు, 10, 5, 8, 3 ఏండ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి.