వర్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, చెరువులు, కుంటలు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు. మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎక్కడా ఎలాంటి నష్టం జరుగలేదని స్పష్టం చేశారు. గర్భిణులు, కిడ్నీ రోగులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్లైన్ నంబర్ 79950 74803 ఏర్పాటు చేశామని, అత్యవసర సమయంలో ఆ నంబర్కు ఫోన్ చేస్తే తక్షణ సహాయం అందుతుందన్నారు. ప్రజలు నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అదేవిధంగా బయ్యారం మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో మంత్రి పర్యటించారు. అలిగేరు, పెద్దవాగు, పందిపంపుల, మశివాగుల ఉధృతిని పరిశీలించారు. వరద ఉధృతి పెరిగితే ఇబ్బందితో పాటు చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మహబూబాబాద్, జూలై 12: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆమె మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, చెరువులు, కుంటలు పూర్తి నిండి ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,622 చెరువులకు గాను 1,400 చెరువులు నిండాయని, 214 చెరువులు మత్తడి పోస్తున్నాయని మంత్రి తెలిపారు. మున్నేరు, ఆకేరు, పాలేరు వంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎక్కడా ఎలాంటి నష్టం జరుగలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు నీటి ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద స్థాయిలో ఉన్న వైర్లకు విద్యుత్ సరాఫరా నిలిపివేయాలన్నారు. ప్రజలకు అవసరమయ్యే మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు.
గర్భిణులు, కిడ్నీ రోగులను జిల్లా కేంద్రంలో వైద్యశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలోని కుంటుబాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని, కేంద్రాల్లో ఆహారం, తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజల కోసం హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని, అత్యవసర సేవల కోసం హెల్ప్లైన్ నంబర్ 79950 74803కు ఫోన్ చేయాలన్నారు. సమీక్షలో ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ శాశంక, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, ఎస్పీ శరత్చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ పాల్వయి రామ్మోహన్రెడ్డి, కమిషనర్ ప్రసన్నా రాణి, తహసీల్దార్ గంగాభవాని, అధికారులు పాల్గొన్నారు.