బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు బీజేపీ జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఒబామా లాడెన్ పేరు మీద ఎప్పుడైనా ఓట్లు అడిగారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్ను చంపేయాలని, చంపేస్తారా? అని సీఎం ఉద్ధవ్ బీజేపీని ప్రశ్నించారు. నిజంగా మంత్రి నవాబ్ మాలిక్కు దావూద్తో సంబంధాలుంటే.. ఇన్ని సంవత్సరాలుగా కేంద్ర దర్యాప్తు బృందాలు ఏం చేశాయని సీఎం ఉద్ధవ్ సూటిగా నిలదీశారు. మంత్రి నవాబ్ మాలిక్కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో వుందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్కు కూడా తెలుసని సీఎం ఉద్ధవ్ పేర్కొన్నారు.