ముంబై: బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో దేశంలోనే అత్యధిక నేరాలు, కేసులు నమోదవుతున్నాయి. 2021కిగాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం మహారాష్ట్రలో 3,67,218 కేసులు నమోదయ్యాయి. 3,57,905 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కాగా, అంతకుముందు ఏడాదితో పోల్చితే మహారాష్ట్రలో కేసుల సంఖ్య 6.8 శాతం తక్కువైందని ఎన్సీఆర్బీ (NCRB) వెల్లడించింది. 2020లో ఆ రాష్ట్రంలో 3,94,017 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నది. సైబర్ క్రైం కేసులు 1.5 శాతం అధికంగా 5562 రికార్డయ్యాయని తెలిపింది.
అదేవిధంగా దాడులకు సంబంధించిన కేసులు కూడా మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నాయని వెల్లడించింది. 2021లో 8709 కేసులు నమోదయ్యాయని, ఇందులో 77 మతాలకు సంబంధించినవి, 86 రాజకీయాలు, 67 కులాలకు, 355 వ్యవసాయానికి, 197 ఆర్థిక లావాదేవీలు, 1259 కేసులు భూములు, ఆస్తులకు, 304 కుటుంబ కలహాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నది.
ఇక ఎక్కువ నేరాలు జరిగిన మెట్రోపాలిటన్ నగరాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ముంబై రెండో ప్లేస్లో నిలిచింది. ఆర్థిక రాజధానిలో 2021లో మొత్తం 63,689 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2020లో కంటే ఇవి 27 శాతం అధికమని ఆ ఏడాది ముంబైలో 50,158 కేసులు నమోదయ్యాయని చెప్పించింది. ఇక కిడ్నాప్, హత్యలు, లైంగిక దాడులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించిన కేసులు కూడా పెరిగిపోయాయని ప్రకటించింది.