ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 4,255 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 12 తర్వాత ఆ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. దీంతో మహారాష్ట్రలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,634కు మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,23,697కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బీ.ఏ.5 వేరియంట్ కరోనా వైరస్ కేసులు మరో రెండు నమోదైనట్లు పేర్కొంది. ఇద్దరు రోగులు కూడా నాగపూర్కు చెందిన వారని, వారు కరోనా టీకాలు తీసుకున్నారని వివరించింది. జూన్ 6న 29 ఏళ్ల వ్యక్తికి, జూన్ 9న 54 ఏళ్ల మహిళకు బీ.ఏ.5 వేరియంట్ సోకినట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో బీ.ఏ.4, బీ.ఏ.5 వేరియంట్ కేసుల సంఖ్య 19కి చేరినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం కొత్తగా 2,366 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,87,326కు చేరింది.