ముంబై : కోళ్లు గుడ్లు పెట్టడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎందుకంటే ఓ కంపెనీ తయారు చేసిన దాణాను ఆ కోళ్లు తినడమే అందుకు కారణమని తేలింది. పుణె జిల్లాకు చెందిన ఓ రైతు తన పొలంలో కోళ్లం ఫారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవలే అహ్మద్నగర్ జిల్లాకు చెందిన ఓ కంపెనీ దాణాను కోళ్లకు పెట్టాడు. ఆ దాణా తిన్న తర్వాత కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. దీంతో సదరు రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ రైతుకు తోడుగా మరో నలుగురు రైతులు కూడా ఇదే సమస్యను పోలీసుల వద్ద ప్రస్తావించారు.
ఈ క్రమంలో పోలీసులు దీనిపై ఓ పశు సంవర్ధక అధికారిని సంప్రదించారు. ఆ అధికారి మాట్లాడుతూ.. దాణా పడకపోవడం వల్లే కోళ్లు గుడ్లు పెట్టడం మానేస్తాయని, ఇది సాధారణ విషయమేనని తెలిపారు. వేరే దాణా పెడితే మళ్లీ గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని చెప్పారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
అయితే దాణా ఉత్పత్తి చేసిన కంపెనీ యజమానిని కూడా పోలీసులు విచారించారు. తమ కంపెనీ తయారు చేసిన దాణా తినడంతో కోళ్లు గుడ్లు పెట్టడం మానేసిన కారణంగా.. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తానని యజమాని ఒప్పుకున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కోళ్లకు, వాటి గుడ్లకు భలే డిమాండ్ పెరిగింది.