ముంబై : విద్వేష వ్యాఖ్యలతో సమాజంలో విభజన తీసుకువచ్చేలా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)చీఫ్ రాజ్ ఠాక్రే వ్యవహరిస్తున్నారని హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. మే 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేసిన నేపధ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్ ఠాక్రే వ్యాఖ్యలను పోలీసులు పరిశీలించి, అభ్యంతరకర వ్యాఖ్యలను గుర్తించి ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నిర్ణయిస్తారని మంత్రి పాటిల్ పేర్కొన్నారు. తాను మంగళవారం అధికారులతో ఈ విషయంపై చర్చిస్తానని ఆపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు ఎంఎన్ఎస్ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ కోరారు.
మహారాష్ట్ర డే సందర్భంగా ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాజ్ ఠాక్రే మాట్లాడుతూ లౌడ్స్పీకర్ల తొలగింపునకు మే 3 డెడ్లైన్ అని హెచ్చరించారు. మసీదుల్లో న్యూసెన్స్ కలిగిస్తున్న లౌడ్స్పీకర్లను తక్షణమే తొలగించాలనే డిమాండ్ను ఆయన పునరుద్ధరించారు.