ముంబై : మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అసంపూర్తిగా చార్జిషీట్ దాఖలు చేసిందంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. అవినీతి కేసులో ఎన్సీపీ నేత దేశ్ముఖ్తో పాటు ఆయన ఇద్దరు మాజీ సహాయకులు సంజీవ్ పలాండే, కుందన్ షిండేలపై సీబీఐ గత వారం 59 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో దేశ్ముఖ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.
న్యాయవాదులు ఇంద్రపాల్ సింగ్, అనికేత్ నికమ్ ద్వారా డిఫాల్ట్ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో జూన్ 2న సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు. మాజీ హోంశాఖ మంత్రి తరఫున న్యాయవాది.. దర్యాప్తు చేయకుండా కేవలం 59 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేసిందన్నారు. దేశ్ముఖ్కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే, ముంబై పోలీస్ కమిషనర్గా పరంబీర్ సింగ్ను తొలగించడంతో ఆయన 2021లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. ఇందులో ముంబైలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలనెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ముఖ్ ఆదేశించినట్టు ఆ లేఖలో పేర్కొనడం సంచలనమైంది.
విధినిర్వహణలో దేశ్ముఖ్, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు సక్రమంగా వ్యవహరించ లేదనడానికి, అవినీతి ప్రవర్తనకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. అనంతరం 2021 నవంబర్లో దేశ్ముఖ్ను సీబీఐ అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను దేశ్ముఖ్ ఖండించినప్పటికీ, ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది హోం మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు.