ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మరాఠా, ఓబీసీ రిజర్వేషన్లు, తౌక్టే తుఫాను సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు అజిత్ పవార్, అశోక్ చవాన్లు సైతం భేటీలో పాల్గొన్ననున్నారు. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లపై ఉద్ధవ్ ఠాక్రే ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరాఠా సమాజాన్ని ఎస్ఈబీసీ (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారు)గా ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.