ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనితాలోకానికి మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. మహిళల పేరిట జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు, మహిళలకు ఆస్తుల బదిలీపై స్టాంప్ డ్యూటీ ఒకశాతం తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటన చేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-21) సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం పన్నుల రూపేణా వచ్చే రెవెన్యూ రూ.2,18,263 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి అసాధారణ ప్రభావం చూపిందని చెప్పారు. రూ.10,226 కోట్ల మేరకు రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు రూ.3,68,987 కోట్లు కాగా, వ్యయం రూ.3,79,213 కోట్లు ఉండొచ్చునని అజిత్ పవార్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం రూ.1000 కోట్లు తగ్గుతుందన్నారు. ఇక మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నట్లు చెప్పారు. బ్రాండెడ్ మద్యం తయారీపై 220 శాతం డ్యూటీ విధిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.800 కోట్ల ఆదాయం లభిస్తుందని చెప్పారు.