ముంబై : మహారాష్ట్ర థానేలో ఆదివారం నాలుగు అంతస్తుల భవనం స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరొకరు గాయపడ్డ అధికారులు తెలిపారు. రాబోడి ప్రాంతంలో ఖత్రీ అపార్ట్మెంట్లోని సీ-వింగ్ మూడో అంతస్తులోని ప్లాట్ స్లాబ్ కులిపోయిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్ అశోక్ బుర్పెల్లే తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల నుంచి ముగ్గురిని రక్షించినట్లు చెప్పారు.
వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామని, ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. భవనం 25 సంవత్సరాల కిందట నిర్మించిందని, భవనంలో 73 వరకు ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా సీ వింగ్లోని 24 కుటుంబాలను తరలించినట్లు అశోక్ పేర్కొన్నారు. సంఘటన జరిగిన తర్వాత బిల్డింగ్ను సీజ్ చేసినట్లు ఆర్డీఎంఎసీ చీఫ్ సంతోష్ కదం తెలిపారు.