ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి పెద్ద ఎత్తున శివసేన ఎమ్మెల్యేలు చేరడంతో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమయ్యారు. సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధపడిన ఠాక్రేను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వారించినట్టు తెలిసింది.
తొందరపాటుతో రాజీనామా నిర్ణయం తీసుకోవద్దని కోరినట్టు సమాచారం. మరోవైపు ఎంవీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేందుకు ఏక్నాథ్ షిండే వర్గం త్వరలో గవర్నర్ను కలిసేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక రెబెల్ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత ఆదిత్య ఠాక్రే విరుచుకుపడ్డారు.
పార్టీకి వెన్నుపోటు పొడిచిన ద్రోహులు విజయం సాధించలేరని, ద్రోహులను ఎన్నటికీ మరవమని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపధ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు అవినీతి కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లను తోసిపుచ్చిన సంజయ్ రౌత్ విచారణ అధికారుల ఎదుట హాజరు కాబోనని తేల్చిచెప్పారు.