అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ ఆరో రోజుకు చేరుకుంది. బాపట్ల జిల్లాలోని ఐలవరం నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈ యాత్ర కనగాల, రాజవోలు మీదుగా నగరం వరకు కొనసాగనుంది. రాజవోలు గ్రామం వద్ద పార్లమెంట్ సభ్యుడు కనకమేడ రవీంద్ర కుమార్ పాదయాత్రకు మద్దతు తెలిపి యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయంపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాన్ని సైతం తప్పుపట్టేలా ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నారని ఆరోపించారు.
శాసన సభలో చట్టాలు చేసే అధికారం లేదని ఏ న్యాయస్థానం చెప్పలేదని అన్నారు. కేంద్రం చేసిన సీఆర్డీఏ చట్టానికి అసెంబ్లీలో సవరణలు చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పిందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎక్కడికి వెళ్లినా రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.