జోగుళాంబా దేవి ఆశీస్సులతో తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని, రాష్ట్రం పసిడి పంటలతో తులతూగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివారం జోగుళాంబ , బాలబ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి నిరంజన్రెడ్డితో పాటు ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య దంపతులు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవానికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్న సీఎం కేసీఆర్ విజయం సాధించాలని పూజలు చేశారు.
అలంపూర్, అక్టోబర్ 2: ఐదో శక్తిపీఠమైన జోగుళాంబా దేవి చల్లని చూపుతో తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి బంగారు పంటలు పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం జోగుళాంబ , బాలబ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
ప్రభుత్వం తరపున మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య దంపతులు కల్యాణోత్సవానికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అంతకు ముందు మంత్రికి ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్ కుమార్, సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మంచి వర్షాలు పడుతున్నాయని తెలిపారు.
పంటల దిగుబడి బాగా వచ్చి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర రంగాల్లో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎనిమిదేండ్ల కాలంలోనే అగ్రగామిగా నిలదొక్కుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. జోగుళాంబ పాదాల చెంత నుంచే ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పాదయాత్ర చేసి అనుకున్నది సాధించారని గుర్తు చేశారు.
నేడు కేసీఆర్ తలపెడుతున్న మహత్కార్యం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంతోపాటు దేశ ప్రజలకు మేలు జరిగేలా దేశ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని, కేసీఆర్ చేపట్టిన ఈ మహాకార్యం విజయవంతం కావాలని కోరారు. దేశాన్ని బాగు చేయడంలో విజేయుడు కావాలని జోగుళాంబను వేడుకున్నట్లు తెలిపారు. మంత్రి వెంట మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
గాంధీ అడుగుజాడల్లో నడవాలి
వనపర్తి, అక్టోబర్ 2: జాతిపిత గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గాలలో ప్రతి ఒక్కరూ నడవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని కళ్యాణసాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, స్వయం సమృద్ధి, పరిశుభ్ర గ్రామాలు, సర్వమత సమానం వంటివి మహాత్ముడు చూపిన మార్గాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి పాల్గొన్నారు.