మత్స్యకారులు సంబురాలు చేసుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో సోమవారం నుంచి చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ సిద్ధమైంది. భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తుండగా.. ఈ ఏడాది మరోసారి చేప పిల్లలు సందడి చేయనున్నాయి. పర్యవేక్షణకుగానూ మత్స్యమిత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చారు. కులవృత్తులకు తెలంగాణ సర్కార్ చేయూతనిస్తుండగా.. మత్స్య సంపద సమృద్ధిగా పెరుగుతుండడంతో స్థానికంగానే ఉపాధి లభిస్తున్నది. మత్స్యకారుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని చెరువులన్నింటిలో చేప పిల్లలను విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చేప పిల్లలను ప్రత్యేకంగా పెంచిన అధికారులు గుర్తించిన రిజర్వాయర్లు చెరువుల్లో వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల ప్రతి చెరువు, కుంట నిండు కుండల్లా మారింది. మరో రెండు నెలలు వర్షాలు కురియనున్నాయి. ఈ క్రమంలో చేప పిల్లలను వదిలేందుకు మార్గం సుగమమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తుండగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనతో జిల్లాల్లోనూ సోమవారం నుంచి చేప పిల్లల విడుదలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీలు, కలెక్టర్ల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాతి రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల సభ్యులతో కలిసి గుర్తించిన చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
కుల, చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. కులవృత్తులపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణులు, రజకులకు విద్యుత్ సబ్సిడీ అందజేయడం జరుగుతోంది. ఇందులో ముఖ్యమైన గొల్ల కురుమలకు త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మత్స్యకారులకూ చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తోంది. చెరువులు, కుంటల్లో బొచ్చ, రోహు, బంగారుతీగను విడుదల చేస్తారు. ఇక రిజర్వాయర్లు, బ్యాక్ వాటర్లో బొచ్చ, రోహుతో పాటుగా మిరుగాల రకాల చేప పిల్లలను విడుదల చేయనున్నారు.
మత్స్యమిత్ర యాప్
చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరిగేలా మత్స్యమిత్ర యాప్ను సైతం ప్రారంభించడం గమనార్హం. చేప పిల్లలతో బయలుదేరిన వాహనం ఎప్పుడు వెళ్లింది.. ఎన్ని చేప పిల్లలను విడుదల చేశారనే వివరాలు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తారు. దీంతో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు లేకుండా పథకం అమలు కానున్నది. మత్స్యకారుల కోసం ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేయడంతో పాటుగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో సంచార చేపల విక్రయ వాహనాలను 60శాతం రాయితీతో ఇవ్వడం, ద్విచక్ర వాహనాలను అందించడం జరుగుతున్నది. ప్రమాదవశాత్తూ మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం సైతం అందుతున్నది. దీనివల్ల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కుతున్నది.
దీనికితోడుగా మత్స్య సంపద సమృద్ధిగా పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా దాదాపు చెరువులన్నింటినీ అభివృద్ధి చేసింది. ఫలితంగా చెరువులు, కుంటలు చేపల పంపకానికి, పెరుగుదలకు ఎంతో అనువుగా మారాయి. ఈ కారణంగా చేపల అమ్మకాలు అధికంగా జరుగుతూ మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. ఇక చేపలను ఇష్టపడే ప్రజలకూ ప్రతిరోజూ లభిస్తుండటంతో ఈ వంటలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. గతంలో చేపల కోసం కృష్ణాతీరంలోని కొల్లాపూర్, గద్వాల, బీచుపల్లి, పెబ్బేర్లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. మిగతా ప్రాంతాల్లో అరుదుగా లభిస్తుండేవి. ఇప్పుడు ప్రతి హోటల్లోనూ, ఫుట్పాత్లపై చేపల వంటకాలు సాధారణంగా మారడం విశేషం. ఆరోగ్యానికి మంచిది కావడంతో మాంసాహార ప్రియులు చేపలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్న చేప పిల్లలు మత్స్యకారులకు, మాంసాహార ప్రియులకూ సంతోషాన్నిస్తున్నది.
నేడు పంపిణీ చేస్తాం
సీఎం కేసీఆర్, మంత్రి తలసానిల ఆదేశాలతో సోమవారం చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ఈసంవత్సరం 1225చెరువుల్లో, 5రిజర్వాయర్లు, శ్రీశైలం ప్రాజెక్టులో చేప 2.20కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నాం. పాలెం పెంటోని చెరువులో సోమవారం కలెక్టర్, జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో లాంఛనంగా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టాం.
– లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి, నాగర్కర్నూల్