గంజాయి మత్తు యువత జీవితాలను చిత్తు చేస్తున్నది. పట్టణ ప్రాంతాలతోపాటు పల్లెలకు సోకిన ఈ ఘాటు కలవర పెడుతున్నది. హై ప్రొఫైల్ ఉన్న యువత ఎక్కువగా బానిస అవుతున్నది. ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ వ్యాపారం కట్టడికి ఎక్సైజ్, పోలీస్ శాఖ కట్టుదిట్టంగా చర్యలు
చేపట్టింది. ప్రత్యేక బృందాలతో ముప్పేట దాడులు చేస్తున్నది. ఈ పంట సాగు చేస్తున్న, రవాణా చేస్తున్న పలు ప్రాంతాలను గుర్తించి స్వాధీనం చేసుకొని అడ్డుకట్ట వేస్తున్నది.
మహబూబ్నగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టడం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్రం యొక్క గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధి సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. గంజాయి మాఫియాను అణిచివేయాలి.. నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు..’ ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ఎక్సైజ్, పోలీసు శాఖలతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో అన్న మాటలు.. పోరాడి సాధించుకున్న తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథాన ముందుకు సాగుతుంటే గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల యువత చెడు మార్గంలో పయనించడం రాష్ర్టానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని సీఎం స్పష్టం చేశారు. ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలని ఆయన పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ రివ్యూ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గంజాయి, మాదకద్రవ్యాలు, గుట్కాపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు భారీగా పెరిగాయి.
ప్రత్యేక బృందాలతో పటిష్ట నిఘా..
గంజాయి అమ్మకాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు దాడులు ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున గంజాయి, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గంజాయి సాగు, సరఫరా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ డిఫ్యూటీ కమిషనర్ ఖురేషీ మహబూబ్నగర్లో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమీపంలో ఉన్న కర్ణాటక, ఏపీ రాష్ర్టాల నుంచి వచ్చే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయిని అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖాధికారులు సమన్వయంతో ముందుకు పోతున్నారు.
గంజాయి సేవించే వారి సమాచారంతో..
ప్రజలు పెద్దగా గమనించని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మిర్చి, పత్తితోపాటు గంజాయిని సాగు చేస్తున్నారు. నల్లమలలో ఇలాంటి వారిపై ఇప్పటికే దాడులు ప్రారంభమయ్యాయి. గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటే.. సాగు చేస్తున్న వారు, సరఫరాదారులను సులభంగా పట్టుకోవచ్చనే కోణంలో అధికారులు ముందుకు సాగారు. నిర్మానుష్య ప్రాంతాల్లో, పాడుబడిన భవనాల్లో, పట్టణాలకు దూరంగా గదులను అద్దెకు తీసుకొని యువత ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో ఓ బ్యాచ్గా ఏర్పడి గంజాయి తీసుకుంటున్న 18 మందిని ఎక్సైజ్, పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని కోడ్ లాంగ్వేజ్ ద్వారా గంజాయి తీసుకుంటున్నారని గుర్తించారు. వీరి ద్వారా ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ గంజాయి పండిస్తున్నారో అధికారులు సమాచారం తీసుకున్నారు. గంజాయి సేవిస్తున్న విద్యార్థులు, యువతను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న హై ప్రొఫైల్ యువత గంజాయికి అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు. వారి ద్వారా కూపీ లాగుతున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి..
మంత్రి శ్రీనివాస్గౌడ్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి, నాటుసారా, ఇతర మాదక ద్రవ్యాలపై దాడులు ముమ్మరం చేశాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయికి అలవాటు పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి తల్లిదండ్రులను పిలిపించి పరిస్థితిని వివరించాం. సదరు విద్యార్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలా గంజాయి ముఠాలను అదుపులోకి తీసుకున్నాం. మరికొందరిపై నిఘా పెట్టాం. త్వరలోనే మరికొందరు గంజాయి తయారీదారులను అరెస్టు చేస్తాం. యువత దైనందిన కార్యక్రమాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. కాల్స్ గమనించాలి. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం మాకు అందించాలి. సమాచారం ఇచ్చేవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి రహిత పాలమూరుకు ఎక్సైజ్ శాఖ నడుం బిగించింది.
భారీగా గంజాయి పట్టివేత..
ఈ నెల 26వ తేదీన మహబూబ్నగర్ మండలం మనికొండలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఐదు పెద్ద గంజాయి చెట్లు స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల బరువున్న వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుంది. అరెస్టు చేసి జైలుకు పంపించారు.
26న కొత్తకోట పట్టణంలో 150 గ్రాముల పొడి గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5 లక్షలకు పైనే. ఇద్దరిని అరెస్టు చేసి బైకును సీజ్ చేశారు.
27న నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ఖాన్దొడ్డి గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.10 లక్షలు ఉంటుంది.
27న జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవబండ గ్రామంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. మిరపతోటలో పెంచుతున్న 43 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో భూమి కౌలుకు ఇచ్చిన రైతును సైతం జైలుకు తరలించారు.
ఉమ్మడి జిల్లాలో గంజాయి సేవిస్తున్న 18 మంది విద్యార్థులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్ నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తల్లిదండ్రులకు సూచించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో గంజాయి సాగు చేస్తున్నారని అందిన సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. మన వద్ద సాగు చేసి కృష్ణానది దాటించే వారిపై నిఘా పెంచారు. గత 10 రోజుల్లో 58 కేసులు నమోదు చేసి.. 46 మందిని అరెస్టు చేశారు. 175 లీటర్ల గుడుంబా, 5,610 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 7,204 కేజీల నల్లబెల్లం, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 14 గంజాయి మొక్కలు, 870 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకొని 26 మందిని బైండోవర్ చేశారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుట్కా విక్రయించే వారిపై దాడులు చేసి స్వాధీనం చేసుకుంటున్నారు.
బీటెక్, ఎంటెక్, ఎంబీఏ విద్యార్థులు, హై ప్రొఫైల్ ఉన్న కుటుంబాలకు చెందిన యువత పలుచోట్ల గంజాయి సేవించేందుకు అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు. మొదటి దశలో ఉన్న వారు గంజాయి మాత్రమే తీసుకుంటున్నారని, తర్వాత ఇంకా ప్రమాదకరమైన డ్రగ్స్కు అలవాటు పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గంజాయి సేవించే వారి అడ్డాలను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.