మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 26 : ఆయన చార్టెడ్ అకౌంటెంట్.. నెలకు లక్షల రూపాయల వేతనం.. కూతురు సాఫ్ట్వేర్ ఇంజినీర్.. కొడుకు మూడు నెలల కిందటే పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. ఆర్థికంగా.. ఉన్నతంగా.. జీవిస్తున్న ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది. కుటంబంలోని దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చో టు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి(54), లత(48) దంపతులు. జిల్లా కేంద్రంలోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నర్సింహారెడ్డి పట్టణంలోని వైడి గుప్తా ట్రేడర్స్తోపాటు చార్టెడ్ ఆకౌంటెంట్గా పని చేస్తున్నాడు. అతడికి కొడుకు, కూతురు సుష్మా ఉన్నారు. మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో కూతురు జిమ్ కోసం బయటకు వెళ్లి తిరిగి 8:30 గంటలకు ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పటికే ఆమె తల్లిదండ్రుకలు ఇద్దరూ హాల్లోని కిటికీకి బట్టల తీగతో ఉరేసుకొని ఉన్నారు. టెన్షన్తో కూతురు రోదిస్తూ చట్టుపక్కల వారిని పిలిచింది. అప్పటికే దంపతులు మృతి చెందారు. విషయం పోలీసులకు తెలియడంతో రూరల్ ఎస్సై రమేశ్, పీఎస్సై సుజాత ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు కెనడా నుంచి బుధవారం రానుండడంతో మృతదేహాలను జనరల్ దవాఖానలోని మార్చురీలో భద్రపరిచారు.
అనారోగ్యమే కారణమా..?
ఐదు పదుల వయస్సులో.. ఇద్దరు పిల్లలు.. ఆర్థికంగా ఎదిగినా.. పాలమూరులో మూడంతస్తుల ఇంటితోపాటు ధర్మాపూర్లో వ్యవసాయ పొలాలు ఉన్నా.. నర్సింహారెడ్డి, లత దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేమిటనే సందేహాలు ఉన్నాయి. అనారోగ్యమే కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. కొడుకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.