టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్లో విజయ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీశ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. బుధవారం నుంచి నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు నారాయణపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొడంగల్లలో సమావేశాలు జరుపనున్నారు. ఈ సభల ద్వారా గర్జనకు తరలివెళ్లేందుకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి గ్రామం నుంచి, పట్టణాల్లో వార్డుకో బస్సులో ప్రజలను తరలించేలా ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల సమస్య రాకుండా కర్ణాటక బస్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. 29న దేవరకద్రలో, 1న మక్తల్లో, మిగితావి నవంబర్ మొదటి వారంలో పూర్తి చేసి గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన వరంగల్లో ఏర్పాటు చేస్తున్న విజయగర్జన సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు అందులో భాగంగా బుధవారం నుంచి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ద్విదశాబ్ది ఉత్సవాలకు భారీగా తరలివెళ్లేందుకు శ్రేణలు సిద్ధమవుతున్నాయి. సన్నాహక సభల ద్వారా వరంగల్ తరలివెళ్లేందుకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధి నుంచే కాకుండా బస్సుల కొరత లేకుండా ఉండేందుకు పక్కనే ఉన్న కర్ణాటకలోని రాయిచూరు డిపోపైనా మన నేతలు ఆధారపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక బస్సు వరంగల్ కదిలేలా నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాల్లో వార్డునకు ఓ బస్సు తరలేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం నారాయణపేట, నాగర్కర్నూ ల్, కల్వకుర్తి, కొడంగల్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. దేవరకద్రలో అక్టోబర్ 29న, మక్తల్లో నవంబర్ 1న సభలు ఏర్పాటు చేయనున్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ నవంబర్ మొదటి వారంలో సన్నాహక సమావేశాలు పూర్తి చేసి మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి గ్రామం, వార్డు నుంచి వరంగల్ బయలుదేరే బస్సుల్లో వెళ్లే నేతలు, కార్యకర్తలకు భోజనాలు, తాగునీటి వసతి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న గద్వాల, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో కార్యకర్తలు తరలివెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి కర్ణాటక డిపో అధికారులతో మాట్లాడి బస్సులు సైతం బుక్ చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని 1,684 గ్రామ పంచాయతీలు, 19 మున్సిపాలిటీల నుంచి సుమారు 2,500 బస్సులు తరలించేందుకు పార్టీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. సన్నాహక సమావేశాల్లో నేతలు, ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యేలు బాధ్యతలు అప్పగించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరగాల్సి ఉన్నా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం, మిగతా కారణాల వల్ల వాయిదా పడ్డాయి.