అచ్చంపేట రూరల్, అక్టోబర్ 22 : నల్లమలలో పులుల గణన కొనసాగుతున్నది. మరో నాలుగు రోజుల పాటు లెక్కింపు కొనసాగనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. నాలుగో విడుతలో భాగంగా మాంసాహార జంతువుల లెక్కింపునకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లా అటవీ ప్రాంతం దేశంలోనే రెండో పెద్ద టైగర్ రిజర్వ్ అని అన్నారు. అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్లలోని అటవీ ప్రాంతాన్ని నాలుగు బ్లాకులుగా విభజన చేసినట్లు వివరించారు. ప్రతి బ్లాకులో రెండు అటవీ క్షేత్రాలు కలుపుకొని 254 బీట్లలో 750 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ ఆదేశాల మేరకు 19న ప్రారంభమైన సర్వే ఇప్పటికే మూడ్రోజులు పూర్తయిందన్నారు. ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కార్ని ఫోర్ సైన్స్ పేరుతో శాస్త్రీయంగా సర్వే జరుగుతున్నదని, ప్రతి బ్లాక్లో 30 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బీట్లో 15 కిలోమీటర్ల చొప్పున సర్వే చేపతున్నామన్నారు. ఈ సర్వే జనవరిలో పూర్తి చేశాక ఫిబ్రవరిలో నేషనల్ టైగర్ సెన్సెస్ అథారిటీ న్యూఢిల్లీ వారికి సర్వే డాటా నివేదికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టులో ఎన్టీసీఏ అధికారులు దేశ వ్యాప్తంగా పెద్ద పులుల గణనను అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. గతేడాది లెక్కింపులో 22 పెద్ద పులులు ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 30 వరకు ఉండొచ్చనే అంచనాకు వచ్చామన్నారు. రెండు, మూడు నెలల కిందట రెండు ఆడ పులులు నాలుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం ఉందన్నారు. అలాగే టైగర్ మానటరింగ్ పేరుతో మాంసాహార జంతువులైన చిరుతపులి, రేస్ కుక్కలు, తర జంతువుల గణన చేపడుతామన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నీటి గుంటలు, చెక్డ్యాంలు, కొలను తదితర ప్రదేశాల్లో సర్వే చేస్తున్నామని, అటవీ అంతర్భాగంలోని బండ్లదారులు, ఫైర్ సెక్షన్లలో యాప్ ద్వారా ప్రత్కేక కెమెరాలను ఏర్పాటు చేశామని కిష్టగౌడ్ తెలిపారు.