మహబూబ్నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లాలోఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కల నెరవేరింది. జోన్ ఏర్పాటుకు సంబంధించిన భూమిని శుక్రవారం టీఎస్ఐఐసీకి అప్పగించారు. మహబూబ్నగర్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్ కె.సీతారామారావుతో కలిసి టీఎస్ఐఐసీకి జోనల్ మేనేజర్ డి.రవికి జోన్ ఏర్పాటుకు సంబంధించిన భూమి పత్రాలను అందజేశారు. స్థలం కేటాయింపుతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు పనులు మొదలు పెట్టే అవకాశం ఏర్పడింది.
మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో..
మహబూబ్నగర్ పట్టణానికి చేరువలో హన్వాడ రెవెన్యూ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కానున్నది. దీంతో భవిష్యత్లో హన్వాడ, మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉన్నది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఆహార సంబంధిత పరిశ్రమల ఏర్పాటుతోపాటు, రైస్ మిల్లులు, గోదాంలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ కార్యక్రమాల యూనిట్లు నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో వరి దిగుబడి భారీగా జరుగుతున్నా.. తగినన్ని రైస్మిల్లులు లేక మిల్లింగ్ కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్తో పాటు ఉమ్మడి జిల్లాలో గడిచిన నాలుగేండ్లలో వరి విస్తీర్ణం, దిగుబడి పెరగడం, ఇతర పంటల దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తున్నది. ఇటీవలి కాలంలో వరితోపాటు కొత్త పంటలపై కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక పద్ధతులు, వ్యవసాయ విధానంపై అవగాహన కల్పిస్తున్నది. తద్వారా ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఇది ఒక మంచి అవకాశం. దీంతో జిల్లాలోని రైతులతోపాటు, యువతకు కూడా మంచి ఉపాధి దొరుకుతుంది. ఆహార సంబంధిత పంటల ఉత్పత్తితోపాటు, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందే ఆస్కారం ఉన్నది.
పీఆర్ఎల్ఐతో మరింత ప్రయోజనం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడుతుంది. దీంతో పంటల దిగుబడి పెరిగి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ద్వారా ఇంకా మెరుగైన అవకాశాలు రావడమే కాకుండా, నూతన పంటలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రైతులు, దీనిపై ఆధారపడి పని చేసే వారి ఆదాయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్తో మహబూబ్నగర్ జిల్లా మరింత ముందుకు దూసుకెళ్తుందనడంలో సందేహం లేదు.
వ్యవసాయ ఊపిరి..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఆహార రంగాల్లో మరింత ముందుకెళ్తుంది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతులకు ఎంతో లాభదాయకంగా మారుతుంది. రవాణా రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మొత్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్తో వ్యవసాయ రంగానికి ఊపిరి పోసినట్లవుతుంది.
పాలమురుకు మహర్దశ..
వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన మహబూబ్నగర్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఇటు రైతులకు, అటు యువతకు మేలు కలుగుతుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా భవిష్యత్తులో జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో పాలమూరుకు మహర్దశ వస్తుంది. జోన్ ఏర్పాటుతో మెరుగైన అవకాశాలు ఏర్పడనున్నాయి.