మహబూబ్నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంధకారంలోకి వెళ్తుందని ఎందరో అవాకులు.. చెవాకులు పేలారని, కానీ తెలంగాణ విశ్వసనీయతకు మారుపేరులా మార్చిన ఘనత ఎలక్ట్రిసిటీ రంగానికే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జీ.జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడితే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిరూపించింది విద్యుత్ రంగమేనని, అందులో ఉద్యోగులు, కార్మికుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద ఉన్న వైట్హౌస్లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ 4వ, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశానికి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కార్మికుల పక్షపాతి అన్నారు. అడగకుండానే వారికి వరాలు ఇచ్చారన్నారు. సంస్థను పరిరక్షించుకోవడంలో కార్మికులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుందన్నారు. కార్మికులే సంస్థలకు యజమానులుగా భావించిన రోజున అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్రంగ సంస్థలు నిలదొక్కుకున్నాయంటే కార్మికుల నిబద్ధతతే కారణమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ సరైనదేనని రుజువు చేసింది విద్యుత్ రంగమే అని అన్నారు. దేశ తలసరి వినియోగానికి సరిసమాన దూరంలో ఉండి తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన రోజున విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లుంటే ఇప్పుడది 16 వేల మెగావాట్లకు పెరిగిందన్నారు. నాడు కేవలం 70 మెగావాట్లకు పరిమితమైన సోలార్ ఇప్పుడు 4 వేల మెగావాట్లకు చేరిందన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లేక నాశనం అ యిందనుకున్న వ్యవసాయ రంగానికి నాలుగేండ్లుగా నిరంతర విద్యుత్ అందుతున్నదన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే అంశంలో తెలంగాణకు పోటీ ఏ రాష్ట్రమూ లేదన్నారు. తెలంగాణ వచ్చాక కొ త్తగా 50 వేల పరిశ్రమలు అదనంగా రావడమే కా కుండా 18 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. పాలమూరు జిల్లాలో 10 నుంచి 14 లక్షల మంది గతంలో వలసలు పోయారని.. ఇప్పు డు ఇతర రాష్ర్టాలకు చెదిన వారు ఇక్కడకు 10 నుంచి 15 లక్షల మంది వలసలు వచ్చి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ రూపంలో ముప్పు ముంచు కొస్తోందని, సంస్కరణల పేరుతో కేంద్రం ఉరితీతకు రంగం సిద్ధం చేస్తున్నదని దుయ్యబట్టారు.
70 ఏండ్లలో సాధ్యం కానిది.
.
రెండున్నరేండ్లలోనే.. : మంత్రి శ్రీనివాస్గౌడ్
సమైక్య రాష్ట్రంలో వేళాపాలలేని కరెంట్ కోతలతో అన్ని రంగాలు కునరిల్లిపోయాయని, అలాంటి పరిస్థితుల్లో కరెంటు కావాలని ధర్నాలు చేస్తే కాల్చి చంపార ని మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశారు. నాడు తెలంగా ణ ఉద్యోగులు, అధికారులు తీవ్రంగా అణచివేతకు గురయ్యారన్నారు. అప్పటి పాలకులు విద్యుత్ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, కరెంటు తీగలపై బట్టలు ఆరేసే దుస్థితి ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, దీంతో కేవలం రెండున్నరేండ్లలో 24 గంటల విద్యుత్ అందించారని తెలిపారు. వ్యవసాయానికి నిరంతర కరెంట్ అందిస్తున్నామంటే విద్యుత్ సిబ్బం ది, కార్మికుల వల్లే సాధ్యమైందన్నారు. 70 ఏండ్లు పాలించిన సమైక్య పాలకుల వల్ల చేతగానిది కేవలం రెండున్నరేండ్లలో సీఎం చేసి చూపించారన్నారు. పరిశ్రమలు మూతపడే స్థాయి నుంచి నూతనంగా స్థాపించే స్థాయి వచ్చిందని చెప్పారు. విద్యుత్ శాఖలో పనిచేసే వారికి 100 శాతం వేతనాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం అన్ని రంగాల మా దిరిగానే విద్యుత్ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ప్రైవేటీకరణ చేస్తే దాని ప్రభావం ఉద్యోగులపైనే కాకుండా సాధారణ ప్రజలపైనా ఉంటుందని, ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. 1104 యూనియన్కు అండగా ఉండి కేంద్రంపై పోరాటం సాగిస్తామన్నారు. అనంతరం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ అ కాల వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ ఉద్యోగులు పడిన కష్టం వెలకట్టలేనిదని, కొవిడ్ సమయంలోనూ కష్టపడిన విధులు నిర్వర్తించారని కొనియాడారు. అక్రమ విద్యుత్ వాడకందారులపై ఉద్యోగులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పద్మారెడ్డి, ప్రధా న కార్యదర్శి సాయిబాబా, సంఘం ప్రతినిధులు జనార్దన్రెడ్డి, శంకర్, సుధీర్, స్వామి, పాండు, అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 22 : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదిలాబాద్కు చెందిన వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద ఉన్న వైట్హౌస్లో రాష్ట్ర యూనియన్ నాలుగో జనరల్ కౌన్సిల్-2021 సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పద్మారెడ్డి పదవీకాలం ముగియడంతో అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లును, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్నగర్కు జిల్లాకు చెందిన సాయిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్గా సుధీర్, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా శంకర్, వరప్రసాద్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ నియామకంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్వామి, పాండునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ.శ్రీనివాసులు, అడిషనల్ సెక్రటరీ కే.శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు.