మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 21 : సమాజానికి మేలు చేసే వారిని ప్రజలు కృతజ్ఞతతో ఎల్లవేళ్లలా గుర్తుంచుకుంటారని, మన రక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించే పోలీసుల త్యాగాలు మరువలేనివని మహబూబ్నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజాసేవలో తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల స్మృతిలో భాగంగా జాతీయ ఫ్లాగ్డేను గురువారం మహబూబ్నగర్ పోలీస్ హెడ్క్వార్టర్స్లోని కవాతు మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల జీవనంలో శాంతియుత వాతావరణం అత్యంత కీలకమన్నారు. సంఘ విద్రోహుల కుట్రలు, దుశ్చర్యలను పోలీసు శాఖ తగిన రీతిలో అణిచివేస్తుందన్నారు. అరాచక శక్తులతో పోరాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39 మంది పోలీసులు అమరులైనట్లు గుర్తు చేశారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నిర్మూలన కోసం ధైర్యసాహసాలు, ఓపికతో పోలీసులు చేసిన కష్టం ప్రజల మదిలో ఎప్పటికీ ఉంటుందన్నారు. ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బందులు కలిగినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించే క్రమంలో దుష్టశక్తులతో పోరాడుతూ దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 377 మంది పోలీసులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారన్నారు. అనంతరం పోలీసు అమరువీరులను గుర్తుచేసుకుంటూ సాయుధ పోలీసు బలగాలు సంప్రదాయ పద్ధతిలో నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా జడ్జి ఎస్.ప్రేమావతి, కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సినియర్ సిటిజన్ ఫోరం సభ్యు లు, రిటైర్డ్ పోలీసు అధికారులు పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను ఎ స్పీ తెలుసుకొని జ్ఞాపిక ను అందజేశారు. అనంతరం పరదేశి నాయుడు చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు లక్ష్మీనారాయణ, శ్రీరాం, డీఎస్పీలు శ్రీనివాసులు, సాయి మనోహర్, కిషన్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.