తిమ్మాజిపేట, అక్టోబర్ 21 : నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని గురువారం హోంశాఖ మంత్రి మహమూద్అలీ సందర్శించారు. కేంద్రం పరిసరాలను పరిశీలించారు. నూతన భవనం కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపాదనలు అందిస్తే వారంలోగా నిధులు మంజూరు చేస్తానని అన్నారు. కరోనా నేపథ్యంలో కొరత ఉన్నప్పటికీ నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అవసరమైతే వచ్చే ఏడాది మరిన్ని నిధులు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా పశువైద్యాధికారి రమేశ్ను అడిగి జిల్లాలో పశువులు, గొర్రెల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. తాను 40 ఏండ్లుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నానని, గతంలో అనేక రోగాలు వచ్చేవని, ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలు, మందుల వల్ల రోగాలు తగ్గుముఖం పట్టాయన్నారు. పాడి రైతులకు రోగాలపై అవగాహన కల్పించాలని, వ్యాధులు రాకముందే జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచించారు. అనంతరం హోం మంత్రిని అధికారులు సన్మానించారు. అంతకుముందు మండలకేంద్రానికి చెందిన ఖ్వాజీ అబ్దుల్ రహమాన్ అనారోగ్యంతో మృతి చెందగా.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పశువైద్యాధికారి శివరాజ్, నాయకులు అయుబ్ఖాన్, అబ్దుల్అలీ, సలీం ఉన్నారు.