ఐదు దేశాలకు మహబూబ్నగర్ మామిడి పండ్లు
ఇప్పటికే 45టన్నుల ఎగుమతి.. మరో 25 టన్నులకు డిమాండ్
లాక్ డౌన్లోనూ ఎగుమతులు
మహబూబ్నగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లాక్డౌన్తో అన్ని రంగాలు కుదేలవుతున్న దశలోనూ మహబూబ్నగర్ నుంచి ఐదు ఐరోపా దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి అవుతున్నాయి. బాలానగర్ మండలం చిన్నరేవల్లి వద్ద ఏర్పాటు చేసిన అన్ష్ ఆగ్రోనమి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జిల్లాకు చెందిన గుంటి ఆనంద్ సాగర్ కొల్లాపూర్ బేనిషాన్ మామిడి పండ్లను యూకే, ఫ్రాన్స్, జర్మనీ, హాలెండ్, ఐర్లాండ్కు ఎగుమతి చేస్తున్నారు. రైతుల నుంచి మేలు రకం పండ్లను సేకరించి వాటిని ప్రాసెస్ చేసిన తర్వాత ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది 250 టన్నులు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు వేసుకోగా.. లాక్డౌన్ కారణంగా 65 టన్నులు మాత్రమే పంపించేందుకు వీలైందని ఉద్యానవన శాఖ డీడీ సాయిబాబా తెలిపారు. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం లేకుంటే తప్పనిసరిగా 250 టన్నులు పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా వైరస్ దెబ్బతో ఇప్పటి వరకు 45 టన్నులు మాత్రమే ఎగుమతి చేసినట్లు వివరించారు.
ఈ సీజన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో 25 టన్నులకు పైగా ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. గతంలో మహారాష్ట్ర, ఉత్తర భారతదేశం నుంచి అల్ఫాన్సో, కేసరి రకం మామిడి పండ్లు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం మన బేనిషాన్ రకానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్తో కార్గో విమానాల సంఖ్య భారీగా తగ్గిపోవడం, ఫ్లైట్ ఛార్జీలు భారీగా పెరిగిపోవడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. విదేశాలకు అనుగుణంగా క్రిమిసంహారకాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్న రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ బేనిషాన్ రకం మామిడి పండ్లే అధికంగా పండిస్తారు.
సుమారు 60 వేల ఎకరాల్లో మామిడి సాగవుతున్నది. దాదాపుగా 2.50 లక్షల టన్నుల మామిడి దిగుబడి అవుతున్నది. విదేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వాటన్నింటినీ ఎగుమతి చేసేందుకు అవకాశం ఉందని ఉద్యానశాఖ డీడీ సాయిబాబా తెలిపారు. విదేశాలకు మామిడి పండ్లను ఎగుమతి చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తామని మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బాలానగర్ మండలం చిన్న రేవల్లి వద్ద ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఆనంద్ సాగర్ పండ్లు, కూరగాయల ఎగుమతి చేసేందుకు ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పి ఐదు దేశాలకు పండ్లు, కూరగాయలను ఎగుమతి చేస్తున్నందుకు అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా జిల్లా యంత్రాంగం తరఫున ఉద్యాన శాఖ ద్వారా ఆనంద్ సాగర్కు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.