గంజాయిపై పోరుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ గుప్పుమంటున్న గంజాయికి చెక్ పడనున్నది. నల్లమలలో పలు చోట్ల అంతర పంటగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా యువత బానిసై బంగారు భవిష్యత్ను దెబ్బతీసుకుంటున్నారు. అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ఎవరైనా సాగు చేసినా.. వాడినా పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుడుంబా తయారీ, విక్రయాన్ని అడ్డుకోగా.. ఇప్పుడు గంజాయిని అరికట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మహబూబ్నగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా కొద్ది మేర ఉన్న గంజాయి సాగుకు చెక్ పడనున్నది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే నాటు సారాపై ఉద్యమం సాగించి అడ్డుకున్న సర్కార్.. ఇప్పుడు గంజాయిపై పోరుకు సిద్ధమవ్వడంతో పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడనున్నది. సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు చాలా తండాలు, మారుమూల గ్రామాల్లో తయారీ, విక్రయాలు జరిగేవి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సారాకు పూ ర్తిగా అడ్డుకట్ట వేశారు. గుడుంబా బట్టీలపై దాడులు చేశారు. ఈ విక్రయాలపై ఆధారపడిన కుటుంబాలకు పునరావాసం కల్పించారు. దీంతో దాదాపుగా గుడుంబా తయారీ నిలిచిపోవడంతో గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించింది. అయితే, గుడుంబా తయారీ ఆగిపోయిందని సంతోషిస్తున్న తరుణంలో గంజాయి వినియోగం పెరగడంతో ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, ఎక్సైజ్ శాఖ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్నదని నివేదిక వస్తున్న నేపథ్యంలో సమర శంఖం పూరించాలని, పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
గంజాయి ఉత్పత్తిని నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లనున్నది. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య తెలంగాణ, మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సాధ్యమైనంత త్వరగా ఈ పీడను తొలగించాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. కరోనా వల్ల చాలా చోట్ల యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నది. కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకున్నారని సమాచారం. ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే అది మానేయడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకే మొగ్గలోనే తుంచేయాలని సర్కార్ సిద్ధమైంది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో గంజాయిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజాయి సాగుకు నల్లమల అడ్డాగా ఉండేది. 2017 వరకు భారీగా గంజాయిని సాగు చేసేవారు. క్రమంగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి తోటలను ధ్వంసం చేశారు. పదర, అమ్రాబాద్, లింగాల మండలాల పరిధిలోని గ్రామాల్లో మిరప, పత్తి, కంది తదితర పంటల్లో అంతరపంటగా కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. స్థానికంగా వినియోగించేందుకు అవసరమైన మేర ఉంచుకొని.. మిగతాదంతా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారం రోజుల కిందట అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామంలో పత్తి చేనులో పండిస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పదర మండలం ఇప్పలపల్లిలో సుమారు 100 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం. సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పోలీసులు సైతం త్వరగా వెళ్లేందుకు వీలు లేనందున గంజాయి సాగు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. కృష్ణానది సమీపంలో ఉండడంతో సులభంగా నది దాటి కర్నూల్, గుంటూరు వైపు తరలిస్తున్నట్లు సమాచారం. గంజాయి సాగు చేసినా, సేవిస్తూ పట్టుబడినా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, 45 రోజుల పాటు రిమాండ్ చేస్తారు. అందుకే గతంలో మాదిరిగా ఇప్పుడు గంజాయి సాగు జరగడం లేదని, తమ దాడులు సైతం భారీగా పెరిగాయని అచ్చంపేట ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు. ఇటీవల మహబూబ్నగర్ పట్టణంలోనూ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వన్టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ బృందం నిషేధిత మత్తు పదార్థాలు దాచిన ప్రాంతంలో దాడులు చేసి జిల్లా కేంద్రంలోని హనుమాన్ పుర కాలనీలో గంజాయిని అమ్ముతున్న యువకుడు మహమ్మద్ జాకీర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.10 వేల విలువ ఉన్న 34 ప్యాకెట్లు (270 గ్రాములు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జన సంచారం లేని ప్రాంతాలే అడ్డాలు..
జన సంచారం లేని పాడుబడిన బంగ్లాలు, రైళ్లు ఆగని రైల్వేస్టేషన్లు, పట్టణ శివారు ప్రాంతాలను గంజాయి సేవించే వారు అడ్డాలుగా ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. మహబూబ్నగర్ మార్కెట్ యార్డ్లో జనం లేని చోట గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా భారీగా పెరగడంతో గంజాయి తీసుకునే వాళ్లు ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తున్నారు. గంజాయికి అలవాటుపడిన యువకులు మిగతావారితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అలా అనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు తెలియచేస్తే గంజాయిని అడ్డుకునే అవకాశం ఏర్పడుతుంది.