‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీసు..’ అంటూ ఓ సినిమాలో ఉన్న ఈ డైలాగ్ పోలీసు గొప్పతనాన్ని చాటుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనది. ఒంటిపై పోలీసు యూనిఫాం.. తలపై టోపీ.. ఆ టోపీపై మూడు సింహాలు.. చేతిలో లాఠీ.. ఈ ఆహార్యంతో కళ్లెదుట నడిచొచ్చే న్యాయమే పోలీసు.. అంతర్గత శత్రువుల నుంచి కాపాడి ప్రజలకు భద్రత, భరోసా ఇస్తున్నారు. ఉగ్రవాదులు, ముష్కరుల దాడి నుంచి దేశాన్ని రక్షించడం.., అసాంఘిక శక్తుల ఆటకట్టించడం.., ప్రజల మాన ప్రాణాలకు కాపాడటంలో వారి సేవలు అభినందనీయం. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి అసువులు బాసిన వీరుడా వందనం.. అభివందనం. భరతమాత కోసం క్రమశిక్షణతో, అంకితభావంతో, నిబద్ధతతో కర్తవ్య నిర్వహణలో జిల్లాకు చెందిన పలువురు ప్రాణాలర్పించారు. నాటి వారి త్యాగఫలమే నేటి మన సంతోష జీవనం.. ప్రజాస్వామ్యం, సమా జ పరిరక్షణ కోసం నిరంత రం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నిరతిని ఓ సారి స్మరించుకుందాం.. పో లీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పది రోజులపాటు ఉమ్మడి జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.. నేడు ఫ్లాగ్ డే సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఉమ్మడి జిల్లాలో 39 మంది అమరులు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 39 మంది పోలీసులు అమరులయ్యారు. నాగర్కర్నూల్ పరిధిలోనే 30 మంది తూటాలకు, ల్యాండ్మైన్లకు బలయ్యారు. 1991లో ఎస్పీ పరదేశినాయుడు సంఘవిద్రోహుల చేతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లాల విభజన ముందు ప్రతి ఏటా పాలమూరులోనే అమరులకు నివాళులర్పించేవారు. గతేడాది నుంచి ఆయా జిల్లాలోని అమరులకు స్థానికంగానే నివాళి అర్పిస్తున్నారు.
1990లో తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటిపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో కానిస్టేబుల్ ప్రభాకర్ బలయ్యారు.
1991లో వంగూర్ పోలీస్స్టేషన్పై దాడి చేయగా.. కానిస్టేబుల్ ఖాజాపాషా ప్రాణాలు వదిలారు.
1991లో కొల్లాపూర్లోని ఓ హోటల్లో కానిస్టేబుల్ ప్రభాకర్ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు.
1993లో సోమశిల వద్ద ఎస్పీ పరదేశినాయుడు తమ సి బ్బందితో కలిసి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీ తో పాటు ఇద్దరు ఎస్సైలు కిశోర్ కుమార్, శివ ప్రసాద్, హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాన్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడిక్కడే మృతిచెందారు.
1994లో తలకొండపల్లి పోలీస్స్టేషన్పై మావోయిస్టులు జరిపిన దాడిలో కానిస్టేబుల్ ఫయోద్దీన్ మరణించారు.
1996లో కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీధర్రెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు.
1997లో బల్మూర్లో పరీక్షల బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ నక్సల్స్ తుటాలకు బలయ్యారు.
1997లో అమ్రాబాద్ పరిధిలోని లక్ష్మాపూర్ నుంచి ట్రాక్టర్లో వెళ్తున్న ఎస్సై మత్సార్, కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరలకు బలయ్యారు.
1997లో అమ్రాబాద్ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ మహబూబ్ ఆలీఖాన్ మరణించారు.
1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఎస్సై భాస్కర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్ బలయ్యారు.
2000లో కానిస్టేబుల్ హన్మనాయక్ను, 2001లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని పదరలో మావోయిస్టులు హతమార్చారు.
2001లో ఆమనగల్లు సమీపంలోని కాటన్మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్సై హన్మంతరెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు.
2002లో కానిస్టేబుల్ మన్ననూర్ పండరీని, 2004లో కొల్లాపూర్ ఎ మ్మెల్యే గన్మెన్లుగా ఉన్న హుమ్లానాయ క్, వెంకట్రెడ్డిని మా వోయిస్టులు తుపాకీతో కాల్చి చంపారు.
2002లో అడ్డాకుల ఎంపీపీ కందూరు నారాయణ గన్మెన్గా ఉన్న సుగుణాకర్ను మావోలు కాల్చిచంపారు.
2005లో బాలానగర్ ఎస్సైని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించి, చివరకు కానిస్టేబుల్ ప్రకాశ్ను కాల్చి చంపారు.
2005లో అచ్చంపేట పోలీస్స్టేషన్ ఎదుట నిల్చున్న హెడ్కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ శేఖర్ నాయక్ను మావోలు కాల్చిచంపారు.
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్మెన్ రాజారెడ్డి నక్సల్స్ తూటాలకు బలయ్యారు.
ఆత్మకూర్ ఎస్సై మొహియుద్దీన్ను పోలీస్స్టేషన్ ఎదుట పట్టపగలే కాల్చిచంపారు.
2006లో కొండనాగులలో హెడ్కానిస్టేబుల్ జహంగీర్, అదే ఏడాది కూంబింగ్ నిర్వహిసున్న జోష్ బాబు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా హతమార్చారు.
కొల్లాపూర్ సింగోటం వద్ద కానిస్టేబుల్ రమేశ్ మావోల తూటాలకు అమరుడయ్యాడు.
అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యం..
1959 అక్టోబర్ 21వ తేదీన జమ్ముకశ్మీర్ రాష్ట్రం లడక్ జిల్లాలోని లెహ్ ప్రాంతంలోని 16 వేల అడుగుల ఎత్తులో మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మనషులు గడ్డకట్టే ఆ చలిలో సైతం భారత జవాన్లు సరిహద్దు గస్తీలో ఉన్నారు. అంతలోనే చైనా సైనికులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ భీకర దాడిలో భారత జవాన్లు 11 మంది దుర్మరణం చెందారు. కొంతమంది చైనా సరిహద్దులో మృతి చెందారు. మృతదేహాలను దేశానికి తీసుకురాలేని పరిస్థితి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం మృతదేహాలను అక్కడే ఖననం చేయాలని నిర్ణయించింది. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు మంచుకొండల్లోనే ఖననం చేశారు. కుటుంబ సభ్యులు తమ వారిని కడసారి చూపునకు నోచుకోలేదు. అసువులు బాసిన సైనికుల ఆత్మకు శాంతికలగాలని ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నారు. లెహ్ ప్రాంతంలో అమరవీరుల సంస్మరణ స్థూపం కూడా నిర్మించారు. అక్టోబర్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఆ ప్రాంతంలో నివాళి కూడా కష్టమే. అందువల్ల ప్రతి ఏడాది సెప్టెంబరులోనే ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో ఐపీఎస్ అధికారిని ఎంపిక చేసి ఒక బృందంగా ఏర్పాటు చేసి పంజాబ్, చండీఘడ్ మీదుగా లెహ్ ప్రాంతానికి పంపుతారు. అధికారుల బృందం అమరవీరులకు నివాళి అర్పించి తిరిగి వస్తుంది.
అమరుల స్ఫూర్తిని కొనసాగిస్తాం..
శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువ అవుతాం. ఈ నెల 21 నుంచి పది రోజుల పాటు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహణ కోసం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. అమరుల కుటుంబాలకు అండగా నిలబడతాం. ప్రజలు, పోలీసులు కుటంబ సభ్యుల్లా కలిసిపోయే పరిస్థితిని కల్పిస్తాం. కమ్యూనిటీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు చేరవై, వారి కష్టాల్లో పాలు పంచుకుంటాం.
‘ఫ్లాగ్డే’గా మార్పు..
ప్రతి ఏడాది నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఫ్లాగ్ డేగా పేరు మార్చారు. ప్రతి ఏటా అక్టోబర్ 15 నుంచి 21వ తే దీ వరకు జరిగే వారోత్సవాలను ఈ సారి 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించేలా మార్పు చేశారు. 21వ తేదీన ఆయా జిల్లాల పోలీస్ కార్యాల యాల ఆవరణలో ఫ్లాగ్ డే నిర్వహించనున్నారు. ఇక ఓపెన్ హౌస్ కార్యక్ర మం, రక్తదాన శిబిరం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లాగ్ డే సందర్భంగా తొలిరోజు కరపత్రాలు, పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఆయా జిల్లాల పరిధిలోనే ఫ్లాగ్డే..
ఫ్లాగ్డేను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీసు అమరులకు నివాళి అర్పించనున్నారు. ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8:45 గంటలకు నివాళులర్పించనున్నారు. పోలీసులతోపాటు అమరుల కుటుంబసభ్యులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నివాళులర్పించిన అనంతరం పోలీసులు ఎస్పీ కార్యాలయం నుంచి ర్యాలీగా వన్టౌన్ చౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ నివాళి అర్పించనున్నారు.