శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో రెండవరోజు శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భ్రామరి సమేతుడైన ముక్కటీశుడు త్రిశాలధారియై భృంగివాహనంపై విహరించారు. శుక్రవారం చండీశ్వర పూజ మండపారాధన కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు జరిపించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన భృంగి వాహనంపై వేంచేబు చేసి షోడశోపచార పూజలు నిర్వహించారు.
మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, నందిమండపం నుండి బయలుదేరి వీరభద్ర స్వామి వరకు ఆద్యాంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ఉత్సవం అనంతరం కాళరాత్రిపూజ, మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవను నిర్వహించారు. గ్రామోత్సవంలో కార్యనిర్వాహణాధికారి కెఎస్ రామారావుతోపాటు, ఈఈ మురళీ బాలకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, ఏఈఓలు హరిదాస్, మల్లయ్య, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్ కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి ,సూపరిండెంట్ అయ్యన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.