తిరుమల : కార్వేటినగరం వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి 22న సాయంత్రం 6 గంటలకు ఆచార్య రుత్విక్వరణం, మృత్సంగ్రహణం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది. కొవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకుయాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. తొలిరోజున సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన జరుగనుంది. 24న ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు పంచగవ్యాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
23న ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు క్షీరాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు అష్టబంధనం నిర్వహిస్తారు. 26న ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు జలాధివాసం, మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు మహా శాంతి తిరుమంజనం, సాయంత్రం 6.30 గంటలకు శయనాధివాసం, విశేష హోమాలు జరుగనున్నాయి. 27న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహూతి, విమాన సంప్రోక్షణ, గోపుర సంప్రోక్షణ, ఉదయం 8 గంటలకు అవాహన ప్రోక్షణ జరుగుతుంది. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు కార్యక్రమం జరుగనుంది.