భోపాల్: గేదె పాలు ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తున్నదని ఆరోపించాడు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నయాగావ్ గ్రామానికి చెందిన 45 ఏండ్ల రైతు బాబూలాల్ జాతవ్, తన గేదెను తీసుకుని శనివారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పాలు పితకనివ్వడం లేదని ఆరోపించాడు. గేదెకు చేతబడి చేసి ఉంటారని గ్రామస్తులు తనకు చెప్పినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
కాగా, పోలీసులు నచ్చజెప్పి పంపగా నాలుగు గంటల తర్వాత బాబూలాల్ మళ్లీ ఆ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. గేదె పాలు ఇచ్చేలా తనకు సహాయం చేయాలని పోలీసులను కోరాడు. దీంతో ఒక పశువైద్యుడి వద్దకు ఆ గేదెను పంపి అతడి బాధను పోలీసులు తీర్చారు.
మరోవైపు బాబూలాల్ జాతవ్ ఆదివారం కూడా ఆ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన గేదె పాలు ఇస్తున్నదని చెప్పి పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరవింద్ షా వెల్లడించారు. కాగా, ఆ వ్యక్తి తన గేదెతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.