భోపాల్, సెప్టెంబర్ 24: దేశంలో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సరిపడా కోర్టులను ఏర్పాటు చేయకపోవడం, న్యాయవాదుల కొరత అనే వాదనలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా మధ్యప్రదేశ్లో భోపాల్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సంబంధించి ఆసక్తికర, విచారకర విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
ఈ కోర్టు ఒక్కటే వ్యాపం కుంభకోణం, పీఎంటీ పరీక్షలకు సంబంధించిన ‘ఇంజిన్ బోగీ’ స్కామ్లతో సహా 54 కేసులను డీల్ చేస్తున్నది. ఈ కేసులన్నింటినీ ఒక్క న్యాయమూర్తే విచారణ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దాదాపు 2 వేల మంది నిందితులను విచారించడం, 500-600 మంది న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం వంటివి జరుగుతున్నాయి. దేశంలో న్యాయవ్యవస్థ పరిస్థితికి ఇది అద్దం పడుతున్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.