శేరిలింగంపల్లి, జనవరి 24 : ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి రవాణా స్మగ్లర్లను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.55 లక్షల విలువైన 265 కిలోల గంజాయి, ఓ ట్రక్కు, రెండు మొబైల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, హతరాస్ జిల్లా, కొట్వాలి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇక్బాల్(35) గంజాయి విక్రయిస్తుంటాడు. అయితే ట్రక్కు (యూపీ86టీ9498) ద్వారా ఒడిశా రాష్ట్రం, కోరాపూట్ జిల్లా, డార్లిపూట్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ప్రాంతానికి వయా హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణాకు పథకం వేశాడు. యూపీ మీరట్కు చెందిన తన తమ్ముడు షారుఖ్(30) సొంత ట్రక్కులారీ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి మహమ్మద్ సలీం(29)తో కలిసి గంజాయిని రవాణా చేసేందుకు ఒప్పించాడు. ఒడిశా నుంచి వీరు ముగ్గురు ఈనెల 21న 265 కిలోల గంజాయి ప్యాకెట్లతో హైదరాబాద్ మీదుగా మీరట్కు బయలుదేరారు.
నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గమనించి సదరు ట్రక్కును ఈనెల 22వ తేదీన నగరంలోని హైటెక్సిటీ ఏంఏంటీఎస్ రైల్వేస్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు 23వ తేదీన గంజాయితో ఉన్న సదరు ట్రక్కుతో పాటు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇక్బాల్, షారుఖ్, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. రూ.8 వేలకు గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి యూపీలో రూ.15వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అయితే గంజాయి రవాణాతో సంబంధమున్న మరో నిందితుడు బబ్లూలాల్ పరారీలో ఉన్నట్లు డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు.
ట్రక్కులో సీక్రెట్ క్యాబిన్లు
సినీపక్కీలో గంజాయి అక్రమ రవాణా కోసం ట్రక్కు లోపల డ్రైవర్ సమీపంలో, ట్రక్కు పైన టూల్ బాక్స్ ప్రాంతంలో గంజాయిని దాచిపెట్టేందుకు ప్రత్యేకంగా సీక్రెట్ క్యాబిన్లను రూపొందించినట్లు డీసీపీ తెలిపారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిచిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్, ఎస్ఐ అవినాశ్ బాబు, ఇతర పోలీసు సిబ్బందిని డీసీపీ శిల్పవల్లి అభినందించారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందర్రావు పాల్గొన్నారు.