MAA History | మా అసోసియేషన్ ఎన్నికలు అంటే కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీకి జరిగే ఎలక్షన్స్ మాత్రమే ! కాబట్టి మామూలుగానే ఈ ఎన్నికలు జరిగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితులు అలా లేవు. ఎన్నికల షెడ్యూల్ మొదలు కాకముందు నుంచే పెద్ద హడావుడి మొదలైంది. ఒకరిపై మరొకరు విమర్శలు, మేనిఫెస్టోలు, మాటల యుద్ధాలతో సాధారణ ఎన్నికలకు ఏం తీసుపోకుండా ఈ సారి ఎన్నికల ప్రక్రియ జరిగింది. దీంతో అసలు ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులో ఎవరు గెలుస్తారనే కుతూహలం జనాల్లో మొదలైంది. అంతేకాకుండా అసలు మా అసోసియేషన్ ( Movie artists association ) ఎలా మొదలైంది? దీని పుట్టుపుర్వోత్తరాలు ఏంటి? అప్పట్లో కూడా ఇలాగే మా ఎన్నికలు ( MAA elections ) జరిగేవా? వంటి విషయాలపై ఇప్పుడు అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. మరి ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం..
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు.. నటీనటులు తమ సమస్యల గురించి చెప్పుకునేందుకు అప్పట్లో దక్షిణాది ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉండేది. దక్షిణాది సినిమా నటీనటులు అందరూ ఆ అసోసియేషన్లో సభ్యులుగా ఉండేవాళ్లు. దర్శక నిర్మాతల నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా.. అందులోనే ఫిర్యాదు చేసుకునేవారు. కానీ టాలీవుడ్ హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత తెలుగు నటీనటులకు ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే కేరళ నటీనటులు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ ( అమ్మ )ను ఏర్పాటు చేసుకున్నారు. అదే తరహాలో తెలుగు ఇండస్ట్రీకి ఒక అసోసియేషన్ను ఉండాలని మా ను ఏర్పాటు చేశారు.
దాదాపు 28 ఏళ్ల క్రితం ఒకసారి పోలీస్ శాఖ సహాయార్థం తెలుగు నటీనటులు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఆ తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో చిరంజీవి, మురళీమోహన్ ఇతర నటీనటుల మధ్య ఒక ఆలోచన వచ్చింది. నటీనటుల సంక్షేమం కోసం అమ్మలాంటి అసోసియేషన్ ఒకటి ఉండాలని వారు భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, దాసరి వంటి పెద్దల సమక్షంలో ప్రతిపాదించారు. దీనికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. దీంతో ఈ అసోసియేషన్ పేరు కూడా అమ్మ తరహాలోనే ఉండాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) అని ఫిక్సయ్యారు. దీనికి మెగాస్టార్ చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమించారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితర సీనియర్లు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. మొదటి రెండేండ్ల పాటు మురళీమోహన్ ఇంట్లోనే మా అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత ఫిలింనగర్లో రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలోకి 1993 అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
నటీనటుల సంక్షేమంతో పాటు.. దర్శక నిర్మాతలతో రెమ్యునరేషన్, ఇతరత్రా వివాదాలను మా అసోసియేషన్ పరిష్కరిస్తుంది. నిరుపేద, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, ఆఫర్లు లేకుండా ఉన్న నటీనటులకు అవకాశాలు ఇప్పించడం కూడా మా అసోసియేషన్ బాధ్యతనే. ఇందుకోసం మా అసోసియేషన్లోని కార్యవర్గ సభ్యులు చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి సభ్యుల బాగోగులు చూసుకుంటారు. పెద్ద నటులకు ఆర్థికంగా ఇబ్బందులు అంతగా ఉండనప్పటికీ.. చిన్న చిన్న నటీనటుల కుటుంబాలు మాత్రం చాలా ఇబ్బందులు పడేవి. ఇది గమనించిన మా అసోసియేషన్.. వారికి సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. నటీనటులు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. వాళ్ల కోసం ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు ప్రవేశపెట్టింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు పరిమిత ఆదాయం లేకపోవడంతో సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. స్టార్ హీరోల సినిమాల బెన్ఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బుతో పాటు.. హిట్ సినిమాలకు వచ్చిన వసూళ్లలో కొంత మొత్తాన్ని వెల్ఫేర్ ఫండ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ఫండ్పై వచ్చే వడ్డీని మా సభ్యుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టేవారు. అంతేకాకుండా కొంతమంది నటీనటులు వాళ్లు తీసుకునే రెమ్యునరేషన్లలోనూ కొంత మా అసోసియేషన్కు విరాళంగా ఇచ్చేవారు. నిరుపేద కళాకారుల వైద్య ఖర్చుల కోసం అని విజయ నిర్మల అప్పట్లో ప్రతి నెల రూ.15వేలు విరాళంగా పంపించేవారు.
మా అసోసియేషన్ ఏర్పడిన కొత్తలో కేవలం 150 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. నటీనటుల సంక్షేమం కోసం మా అసోసియేషన్ చేస్తున్న పనులు చూసి ఇందులో సభ్యులుగా చేరే కళాకారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో అసోసియేషన్ ఫండ్ కోసం సభ్యత్వ రుసుమును వసూలు చేయడం మొదలు పెట్టారు. మొదట రూ.5వేలుగా ఉన్న ఈ సభ్యత్వ రుసుము క్రమంగా పెరుగుతూ.. ఇప్పుడు లక్ష రూపాయల వరకు అయింది. ప్రస్తుతం మా అసోసియేషన్లో 900 మందికి పైగా శాశ్వత సభ్యులు ఉండగా.. 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వీరిలో 850 మంది యాక్టివ్ సభ్యులుగా ఉన్నారు.
మా అసోసియేషన్ ఏర్పడిన సమయంలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి నియమితులయ్యారు. చిరు, కృష్ణ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ( 1993 నుంచి 1999 వరకు) జనరల్ సెక్రటరీగా మురళీ మోహన్ ఉన్నారు. ఆ తర్వాత మా అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. 1999 నుంచి 2015 వరకు వరుసగా ఐదు దఫాలుగా మురళీ మోహన్ మా అధ్యక్షుడిగా కొనసాగారు. గతంలో మోహన్ బాబు, నాగార్జున, నాగబాబు కూడా మా అధ్యక్షులుగా పనిచేశారు. మా అసోసియేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి రెండేండ్లకు ఒకసారి మా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాకపోతే ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగానే మా అధ్యక్షుడిని ఎంపిక చేసేవారు. కానీ 2015 తర్వాత తలెత్తిన విభేదాల నేపథ్యంలో మా అధ్యక్షుడి ఎంపిక కోసం మా ఎన్నికలు నిర్వహించడం మొదలు పెట్టారు. అలా జరిగిన ఎన్నికల్లో గెలిచిన రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, నరేశ్ మా అధ్యక్షులుగా కొనసాగారు.
మా అధ్యక్ష పదవి నుంచి మురళీమోహన్ తప్పుకున్న తర్వాత జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీలో నిలిచారు. దీంతో మా అసోసియేషన్లో తొలిసారిగా 2015లో మా ఎన్నికలు వేడీ మొదలైంది. అలా తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లో శివాజీ రాజా నరేశ్ పోటీపడ్డారు. ఆ సమయంలో సినీ పెద్దలు కలగజేసుకుని నరేశ్కు నచ్చజెప్పారు. శివాజీ రాజాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శివాజీరాజా పదవీకాలం ముగిసిన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో నరేశ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 2021 మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్లు పోటీ పడ్డాయి. మరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood | ఈ సారి మా ఎన్నికల్లో ఓటేయని స్టార్స్ వీళ్ళే..
Maa elections | రికార్డు స్థాయిలో ఓటింగ్.. ఎవరిపై కోపం ఎవరిపై చూపిస్తున్నారో..?
Maa Elections 2021 | ‘మా’ ఎన్నికల్లో ఓటేసిన తారలు..ఎవరేమన్నారంటే..?
MAA Elections: శివ బాలాజీ చేయి కొరికిన హేమ.. ఏం జరిగిందో ఎలక్షన్ తర్వాత చెప్తానంటూ కామెంట్
Manchu vishnu | నాగబాబును అంకుల్ అంటూనే.. మంచు విష్ణు కౌంటర్
Pawan Kalyan: చిరంజీవి, మోహన్ బాబు ఎప్పటికీ స్నేహితులే: పవన్ కళ్యాణ్