న్యూఢిల్లీ: రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర కొన్ని నగరాల్లో సెంచరీ మార్క్ను దాటేసింది. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా వేగంగా పెరుగుతున్నది. దీనిపై కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన సమాధానమే షాకింగ్గా ఉంది.
2013లో పెట్రోల్, డీజిల్లపై విధించిన దిగుమతి సుంకాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.52,537 కోట్ల ఆదాయం వచ్చిందని సోమవారం పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఏడేండ్లలో వంట గ్యాస్ ధర రెట్టింపై రూ.819లకు చేరుకున్నది. మరోవైపు పెట్రోల్, డీజిల్ల దిగుమతిపై విధించిన సుంకాలతో ప్రభుత్వాదాయం 459 శాతానికి పైగా పెరిగిందని ఆయన చెప్పారు.
2019-20లో పెట్రోల్, డీజిల్లపై విధించిన దిగుమతి సుంకాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.2.13 లక్షల కోట్ల ఆదాయం లభించిందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గత 11 నెలల్లోనే రూ.2.92 లక్షల కోట్ల ఆదాయం సంపాదించామన్నారు. 2013తో పోలిస్తే 2019-20లో దాదాపు 5.6 రెట్లు ఆదాయం కేంద్రానికి లభించింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు మోదీ సర్కార్ 2020లో రెండు దఫాలు పెట్రోల్, డీజిల్ దిగుమతి సుంకాలను పెంచడం గమనార్హం.