హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. అకడకడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్కడే కొనసాగుతున్నదన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి మధ్య ట్రోపోస్పియరిక్ స్థాయి వరకు విస్తరించి ఉన్నదని పేర్కొన్నారు. ఇది 24 గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయవ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకొనే అవకాశం ఉన్నదని వివరించారు. వీటి ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హెచ్చరించారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వివరించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం జోరుగా వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 21.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాపన్నపేట మండలం ఏడుపాయల దుర్గామాత ఆలయం ఎదుట నుంచి మంజీర పరవళ్లు తొక్కుతున్నది.
రామారెడ్డి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన క్యాతం వెంకటి (47) శనివారం కారులో కామారెడ్డికి వచ్చి రామారెడ్డి గ్రామానికి వెళ్తున్నాడు. రామారెడ్డి శివారులో కారు అదుపు తప్పి గంగమ్మ వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటి మృతి చెందాడు.