హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. అల్పపీడనం వాయువ్యదిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట, సంగారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో 242 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల మండలం కాసిపేటలో 5.36, కుమ్రంభీం జిల్లా తిర్యాణిలో 3.64, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 3.61 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు టీఎస్ టీపీఎస్ వివరించింది.