మంగళూరు, ఆగస్టు 15: మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం ఒకటి ఆరు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. కారణం ఏంటో తెలుసా.. ఫోన్లో చిన్న మెసేజ్! బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడికి అతని స్నేహితురాలు సరదాగా ‘నువ్వే బాంబర్’ అంటూ ఓ సందేశం పంపింది.
ఈ మెసేజ్ను ఆ అబ్బాయి వెనుక కూర్చున్న మహిళా ప్యాసింజర్ చూసింది. వెంటనే ఈ విషయాన్ని విమానం సిబ్బందికి తెలిపింది. దీంతో అప్పటికే రన్వే మీదికి వెళ్లిన విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించారు. విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి, యువకుడి సామాన్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సదరు యువకుడిని, ఆ మెసేజ్ పంపిన అమ్మాయిని ప్రశ్నించారు. సరదాగా జరిగిన చాటింగే అని గుర్తించి ఇద్దరినీ వదిలేశారు.