Kotak Mahindra Bank | ఆసియాలోకెల్లా రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కొటక్.. కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో. వచ్చే ఏడాది (2023) డిసెంబర్తో బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కొటక్ వైదొగాల్సి ఉంటుంది. బ్యాంకులకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నిర్వహణకు 15 ఏండ్ల పరిమితి విధించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ). ఇప్పటికే కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ ఇప్పటికే 18 ఏండ్లకు పైగా కొనసాగారు. తదుపరి ఆయన కొనసాగింపునకు ఆర్బీఐ అనుమతించడం అనుమానమేనని అంటున్నారు. ఇప్పటి నుంచి తన వారసుడిగా ఉదయ్ కొటక్ పెద్ద కొడుకు జయ్ కొటక్కు ముందుకు తెచ్చారని చెబుతున్నారు.
కొటక్ మహీంద్రా బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ రోల్ నిర్వహణలో జయ్ కొటక్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేశారు. దీన్ని బట్టి మున్ముందు కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కొటక్ స్థానంలో భవిష్యత్లో జయ్ కొటక్ నియమితులవుతారని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడైతే బ్యాంక్ వెటరన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న కేవీఎస్ మనియన్ను కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా నియమించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత నవంబర్లో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్లో .. డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్ 811, బ్యాంకు వృద్ధిపై జరిగిన చర్చలో జయ్ కొటక్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల బ్యాంక్ టాప్ ఎగ్జిక్యూటివ్ల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇంతకుముందు రిటైల్ బిజినెస్ హెడ్గా ఉన్న శాంతి ఏకాంబరాన్ని ఈడీగా ప్రమోట్ చేశారు. ఇన్వెస్టర్ మీట్కు 811 కో-హెడ్గా జయ్ కొటక్తోపాటు ఉదయ్ కొటక్, శాంతి ఏకాంబరం, మనీశ్ అగర్వాల్ సారధ్యం వహించారు. ప్రస్తుతం బ్యాంక్ డిజిటల్ ప్రొడక్ట్ 811 స్ట్రాటర్జీ అండ్ ప్రొడక్ట్ ఇన్చార్జీగా ఉన్నారు. ప్రస్తుత బాధ్యతల నిర్వహణలో ప్రతిభను బట్టే భవిష్యత్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ సారధ్య బాధ్యతలు చేపడతారని అంటున్నారు.