న్యూఢిల్లీ, జూలై 26: దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళవారం లోక్సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు-2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై జరిగిన డిబేట్లో ఈ అంశం చర్చకు వచ్చింది.
ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరుగుతూ పోతున్నాయని, వాటిని వేగవంతంగా పరిష్కరించాలని జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అన్నారు. ఈ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతబ్ డిమాండ్ చేశారు. 2008లో నాగాలాండ్లో, 2019లో హిమాచల్ప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కోర్టులకు చట్టబద్ధత కల్పిస్తూ నిబంధనలు చేర్చేందుకు తాజా సవరణ బిల్లు తీసుకువచ్చారు.
కశ్మీరీ పండిట్లు ఉద్యోగాలు వీడలేదు
ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీ పండిట్లు ఎవరూ జమ్ముకశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.