పరిపాలనా వ్యవస్థ బలోపేతానికే నిధులు: ఎమ్మెల్సీ కవిత
నిధుల కేటాయింపుపై ప్రజాప్రతినిధుల ధన్యవాదాలు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బడ్జెట్లో స్థానిక సంస్థలకు రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ చాంబర్, జడ్పీటీసీ, ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో జిల్లా పరిషత్లకు రూ.252 కోట్లు, మండల పరిషత్లకు రూ.248 కోట్లు కేటాయించిందని వివరించారు. పరిపాలనా వ్యవస్థలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్ర మరింత కీలకంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
జడ్పీటీసీలకు, ఎంపీపీలకు నిధుల కేటాయింపులో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు వివిధ సంఘాల ప్రతినిధులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఉపాధ్యక్షుడు అశోక్రావు, రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమల్ల గుట్టయ్య, ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు నాగేశ్ సహా వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.