చికెన్ ప్రియులు నాటుకోడే ముద్దని అంటున్నారు. దీంతో వాటికి గిరాకీ పెరిగింది. నాటు మాంసం ధరలూ పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో నాటు కోళ్ల పెంపకానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇంటిముందు చిన్నపాటి ఖాళీ స్థలం ఉన్నా పెంచుకొనే అవకాశం ఉండటంతో స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా నాటుకోళ్ల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. వారిని మరింత ప్రోత్సహించాలని ‘స్త్రీనిధి’ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా, విరివిగా రుణాలు అందిస్తున్నది. రాష్ట్రంలోని మహిళా సంఘాలవారు గత ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పదిహేను వేల యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని ‘స్త్రీ నిధి’ లక్ష్యంగా పెట్టుకున్నది. 50 కోళ్లు పెంచడానికి రూ.12,500, వందకోళ్లకు రూ.22 వేల రుణాన్ని అందిస్తున్నది. కోడి పిల్లల యూనిట్ ఏర్పాటుకు రూ.3 లక్షల వరకూ మంజూరు చేస్తున్నది. కోడి పిల్లల కొనుగోలు, దాణా తయారీ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మహిళలకు అవగాహన కూడా కల్పిస్తున్నది.
‘కోడి పిల్లలను బాసర నుంచి, వాటికి అవసరమైన దాణాను కోటగిరి నుంచి తెచ్చుకుంటాం. రెండున్నర కిలోల బరువు పెరిగాక కోళ్లను అమ్ముతాం. కిలో రూ.400 వరకూ పలుకుతుంది. మా దగ్గరికే వచ్చి కొంటారు. ప్రస్తుతం వంద కోడి పిల్లలను పెంచుతున్నా. మాకు వ్యవసాయం కూడా ఉన్నది. నాటు కోళ్ల పెంపకానికి స్త్రీనిధి నుంచి రూ.22 వేల రుణం తీసుకున్నా. కోళ్లకు వ్యాక్సిన్ కూడా వేయిస్తాం. వ్యాపారం మంచిగా నడుస్తున్నది. కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నా’ అంటారు నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండలం, ఎత్తొండ క్యాంపునకు చెందిన పద్మలత.
-నెలకుర్తి శ్రీనివాస్ రెడ్డి