న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం షాపులను ఓపెన్ చేసింది. కరోల్బాగ్, రాజౌరి గార్డెన్, ద్వారకా, ముంద్క, శివాజీ పార్క్, సుల్తాన్పురి, సుభాష్ నగర్, బదార్పూర్ మెట్రో స్టేషన్లలో మద్యం షాపులను తెరిచారు.
ఈ మద్యం షాపుల్లో ప్రతి ఒక్కరూ మద్యం కొనుగోలు చేయవచ్చని, ప్రస్తుతం చిన్న షాపులు ఓపెన్ అయ్యాయని, భారీ మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. 2021 నవంబర్ 17న అమలైన నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేసి ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించిన అనంతరం మెట్రో స్టేషన్లలో మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.
ఇక మెట్రో స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటైన ఈ దుకాణాలు ఢిల్లీ కన్జూమర్ కో ఆపరేటివ్ హోల్సేల్ స్టోర్ పరిధిలోకి వస్తాయి. ఈ నెలాఖరు నాటికి ఢిల్లీలో 500 మద్యం దుకాణాలతో పాటు సంవత్సరాంతానికి మరో 200 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.