లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల ఫలితం ఈ రోజు తేలనున్నది. సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డివిజన్లో 49,203 ఓటర్లు ఉండగా ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల్లో 13,591మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఐఏఎస్ అధికారి కిషన్ పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మూడు రూంలలో ఐదేసి టేబుళ్లు చొప్పున మొత్తం 15 టేబుళ్లపై లెక్కింపు జరుగనున్నది. ముందుగా పోలైన ఓట్లను 25 చొప్పున బండిల్స్గా కట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ఏఈఏ సురేందర్రెడ్డి తెలిపారు. 11 గంటల వరకు ఫలితం తేలిపోతుందని చెప్పారు. కౌంటింగ్ పక్రియను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పాటుగా వీడియో రికార్డింగ్ మధ్య చేపట్టనున్నట్లు తెలిపారు.
లింగోజిగూడ ఉప ఎన్నికల కౌటింగ్లో పాల్గొనే కింది స్థాయి సిబ్బంది మొదలు అధికారి వరకు అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ వచ్చిన వారినే కౌంటింగ్ కోసం నియమించారు. అంతేకాకుండా అభ్యర్థులు, ఏజెంట్లు నెగెటివ్ వచ్చినట్లు రిపోర్టు చూపితేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.