తమిళనాడులో జరిగిన నిజఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్. హీరో సూర్య ఈ సినిమాను భార్య జ్యోతికతో కలిసి నిర్మించడమే కాదు.. అందులో లాయర్ చంద్రు పాత్రలో నటించి ప్రశంసలు కూడా అందుకున్నారు . ఇక పోలీస్ లాకప్లో చనిపోయిన బాధితుడు రాజన్న భార్య సినతల్లి పాత్రలో నటించిన మలయాళ సుందరి లిజోమోల్ జోస్ పాత్ర కూడా ఎంతో మందిని ఆకర్షించింది. ఈ పాత్ర కోసం తాను ఎంత కష్టపడిందో తాజాగా వివరించింది.
సినతల్లి జీవనం.. వారి పద్దతులు తెలుసుకోవడానికి ప్రతిరోజూ గుడిసెలకు వెళ్ళేదాన్ని. వాళ్లు చెప్పులు వేసుకోరని.. పగలు రాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని.. అవన్ని పనులు తాను కూడా చేసినట్లు తెలిపింది లిజోమోల్ . సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని.. అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది. అంతేకాకుండా.. ఆ గిరిజనులు కేవలం పొలాల్లో ఉండే ఎలుకలను వండుకు తింటారని..వాళ్లలా నేను ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలి కాబట్టి ఎలుక కూర కూడా తిన్నానని స్పష్టం చేసింది.
ఎలుకల కూర అచ్చం చికెన్ లా అనిపించిందని.. ఇంట్లో వాళ్లకు తెలిసి తనను అడిగారని.. కానీ తను వాళ్లకు సర్ది చెప్పానని తెలిపింది. అప్పటి నుంచి ఆ విషయం ఇంట్లో వాళ్లు అడగలేదని చెప్పుకొచ్చింది లిజోమోల్. కాగా, సామాజిక అసమానతలను ప్రశ్నించేలా రూపొందిన చిత్రం జై భీమ్. ఈ సినిమా రాజకీయ పరమైన విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. హీరో సూర్య తమ సంఘాన్ని అవమానించారంటూ వన్నియార్లు ఆయనపై కేసు పెట్టి ఐదు కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు.