మెండోరా/నందికొండ/కేతేపల్లి, అక్టోబర్ 6 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో 3 వరద గేట్లు ఎత్తి దిగువకు 8,360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 17,660 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉన్నది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో తగ్గడంతో గురువారం క్రస్ట్గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి సాగర్కు 62,732 క్యూసెక్కు ల ఇన్ఫ్లో రాగా, 49,817 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 589.80 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది.