హైదరాబాద్ : నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 32 గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు 50వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,32,325 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు ఉన్నది.
గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 84.810 టీఎంసీల నీరు ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జూలై నెలాఖరులోపే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో కేవలం 33 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతి భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి దాదాపు 84 టీఎంసీలకు చేరుకుందని చెప్పారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న క్రమంలో అధికారులు అప్రమత్తమై ముందస్తుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గేట్లను ఎత్తి, దిగువకు నీటిని వదులుతున్నారు.