ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితులను మెరుగుపరిచేందుకు కలిసి పని చేద్దామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కేంద్రమంత్రికి పిలుపునిచ్చారు. గురువారం మాట్లాడుతూ కొవిడ్ పరిస్థితి మహారాష్ట్రలో భయంకరంగా ఉందని, ఈ మేరకు సహాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో మాట్లాడానని, మహారాష్ట్రతో పాటు మిగతా రాష్ట్రాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం, క్రియాశీల కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కొన్ని కఠినమైన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య కార్యకర్తలు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. నిపుణుల సలహాల మేరకు వైరస్ చైన్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందున్నారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి బుధవారం మహారాష్ట్ర పాటు పలు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, భయాందోళనలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా టీకాల నిల్వలు నిండుకున్నాయని చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని స్పష్టం చేశారు.