హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత గొప్ప లిఖిత రాజ్యాంగం ఉన్న భారతదేశం సగర్వంగా జరుపుకుంటున్న 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలే ప్రభువులుగా పాలించుకునే గొప్ప లక్షణం ఈ గణతంత్రమని…అందుకే ఈ రోజును మనమంతా జాతీయ పండుగగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిబంధనల మేరకు ఈ గణతంత్ర దినోత్సవాలు నియంత్రిత విధానంలో చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
భారతదేశం సమాఖ్య రాష్ట్రాల సమాహరమని, ఈ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు కంకణబద్దులయ్యారని, దీనికి నేడు దేశమంతా సహకరిస్తోంది అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి రాజ్యాంగాన్ని రాజకీయం చేసే వారికి సరైన రీతిలో ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తిని సంరక్షిస్తూ…ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఆశయ సాధనకు మనమంతా పాటుపడాలి అన్నారు. మరోసారి రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.